బాక్సాఫీస్ వద్ద 'సాహో' కథ ముగిసింది!
on Sep 28, 2019
ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన 'సాహో' మూవీ కథ బాక్సాఫీస్ దగ్గర దాదాపు ముగిసింది. టాలీవుడ్ హిస్టరీలో దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ అది టాప్ 4 ఫిలింగా నిలిచింది. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా 'సాహో' కంటే ముందున్న సినిమాలు.. 'బాహుబలి 2', 'బాహుబలి', 'రంగస్థలం' మాత్రమే. అయినప్పటికీ తెలుగునాట ఈ సినిమా బయ్యర్లందరికీ నష్టాలు తీసుకురావడం గమనించాల్సిన అంశం. ఆ మాటకొస్తే ఒక్క నార్త్ ఇండియా మినహా మిగతా అన్ని ఏరియాల్లోనూ 'సాహో' బయ్యర్లు నష్టపోయారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి.. అంటే, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలు కలిపి.. బయ్యర్లు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలకు కారణం.. సినిమాని భారీ రేట్లకు అమ్మడమేనని వాళ్లంటున్నారు. ఈ ఏరియాల్లో 'సాహో' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 120 కోట్లకు పై మాటే అని అంచనా. ఇప్పటి దాకా వచ్చిన షేర్ 81 కోట్ల రూపాయలు.
మిగతా రెండు ఏరియాలతో పోలిస్తే రాయలసీమ ఏరియా బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఇక్కడ 50 శాతం కూడా రికవర్ కాలేదని విశ్లేషకులు తెలిపారు. 25 కోట్ల రూపాయలు వస్తే సేఫ్ అయ్యే ఈ ఏరియాలో వచ్చింది 12 కోట్ల రూపాయలే. తెలంగాణలో 'సాహో'ని రిలీజ్ చేసిన దిల్ రాజు సైతం భారీగా నష్టపోయారు. ఆ నష్టాలు 10 కోట్ల రూపాయల మేర ఉన్నాయని అంచనా. ఈ ఏరియా హక్కుల కోసం ఆయన 40 కోట్ల రూపాయలు వెచ్చించారు.
ఆంధ్రాలోని వైజాగ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఏరియాలు కలిపి 'సాహో'పై బయ్యర్లు వెచ్చించిన డబ్బు 56 కోట్ల రూపాయలని అంచనా. ఇందులో 73 శాతమే రికవర్ అయ్యింది. మొత్తంగా చూస్తే.. తెలుగునాట మూడు ప్రాంతాల్లో రికవర్ అయ్యింది 67 శాతం మాత్రమేననీ, దీన్ని బట్టి 'సాహో' నష్టాలు ఏ రీతిలో ఉన్నాయో ఊహించవచ్చనీ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగునాటే కాదు.. తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల బయ్యర్లు కూడా బాగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా తమిళనాడు బయ్యర్లు 'సాహో' వసూళ్లు చూసి బెంబేలెత్తిపోయారు. ఇక్కడి బయ్యర్లు 16 కోట్లు వెచ్చిస్తే వచ్చింది 33 శాతమే. అంటే ఏ స్థాయిలో అక్కడి బయ్యర్లు మునిగారో అర్థం చేసుకోవచ్చు. ఇక కర్ణాటకలో 57 శాతం, కేరళలో 35 శాతం మాత్రమే బయ్యర్లకు దక్కాయి.
ఓవర్సీస్లోనూ ఇదే పరిస్థితి. కాకపోతే నష్టాల పరంగా ఒకింత బెటర్ అనుకొని తృప్తి పడాలి. ఇక్కడి బయ్యర్లు 28 శాతం మేర నష్టపోయారని ట్రేడ్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. అవసరానికి మించి ఖర్చుపెట్టి, హైప్ తీసుకువచ్చి, భారీ రేట్లకు అమ్మడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
అయితే ఒక విషయం ఆనందం కలిగిస్తోంది. గతంలో ఏ టాలీవుడ్ హీరోకూ లేని విధంగా ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్గా, ఆ మాటకొస్తే బాలీవుడ్ టాప్ స్టార్స్కు ధీటుగా నిలబడ్డాడు. ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియాలోని 'బి, సి' సెంటర్స్లో బాలీవుడ్ స్టార్స్కు మించి ఆదరణ పొందాడు. విడుదలైనప్పుడు వచ్చిన నెగటివ్ టాక్ను తట్టుకొని హిందీ వెర్షన్ 18 శాతం లాభాలు గడించడమంటే మాటలా!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
