ENGLISH | TELUGU  

'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్ని పాటలో తెలుసా?

on Nov 9, 2019

 

ఎస్.ఎస్. రాజమౌళి తొలిసారి ఇద్దరు టాప్ స్టార్స్‌తో రూపొందిస్తోన్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైన అలియా భట్ ఒక నాయికగా నటిస్తోండగా, మరో బాలీవుడ్ టాప్ స్టార్ అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగునేలపై జన్మించిన ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్), కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) జీవితాల్లో గుప్తంగా ఉండిపోయిన మూడేళ్ల కాలాన్ని తీసుకొని, కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడు. అంటే 20వ శతాబ్దం తొలినాటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఒకరేమో బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసిన మన్యం వీరుడు, మరొకరేమో కిరాతక రజాకార్లను ఎదుర్కొన్న గోండు వీరుడు కావడంతో ఈ సినిమాలో పాటలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి సంగీత ప్రియుల్లో వ్యక్తమవుతోంది.

రాజమౌళి సినిమాల్లో పాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుందనే విషయం ఆయన తొలి చిత్రం 'స్టూడెంట్ నెం.1' సినిమా నుంచే చూస్తూ వస్తున్నాం. డ్యూయెట్లు, సందర్భానుసారం వచ్చే పాటలతో ఆయన సినిమాలు కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆయన మునుపటి జానపద చిత్రాలు 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కన్‌క్లూజన్'లోనూ పాటలు ఎలా ఉన్నాయో, అవెంతగా అలరించాయో చూశాం. కానీ, సీరియస్ సబ్జెక్టుతో తీస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'లో అలాంటి కలర్‌ఫుల్ సాంగ్స్‌కు ఆస్కారం ఉంటుందా?.. అనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతోంది.

అయితే 'ఆర్ ఆర్ ఆర్'లో కథకు పాటలు చాలా కీలకమనే విషయం తెలియవచ్చింది. ఆ పాటల్లో కొన్ని కథను నడిపిస్తాయని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ కోసం రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏడు పాటలకు స్వరాలు కూర్చారు. వాటిలో యుగళ గీతాలు, ఉద్వేగభరిత పాటలు, జానపదశైలిలో ఉర్రూతలూగించే పాటలు ఉన్నాయి. రాంచరణ్, అలియా జంటపై ఒక యుగళగీతాన్ని చిత్రీకరించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పేరుపొందిన గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ ఇప్పటికే మూడు పాటలను రాశారు. ఈ పాటల్లో విప్లవ, జానపద శైలి వరుసలు ఉన్నాయని తెలుస్తోంది. రాజమౌళి సినిమాకు అశోక్‌తేజ పాటలు రాయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొమరం భీమ్ కు సంబంధించిన పాటల్ని ఆయన రాసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాకు పాటలు రాస్తున్న విషయాన్ని మార్చిలోనే కీరవాణి వెల్లడించారు. మిగతా పాటల్ని ఎవరు రాశారనే విషయం తెలియాల్సి ఉంది.

రాంచరణ్ జోడీగా అలియా నటిస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయిక ఎవరనేది ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. బ్రిటిష్ తార డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి వ్యక్తిగత కారణాలతో ఏప్రిల్లోనే తప్పుకున్నా, మళ్లీ ఇంతదాకా ఆ పాత్రను ఎవరు చేస్తున్నారనే విషయం బయటకు రాలేదు. హాలీవుడ్ తార ఎమ్మా రాబర్ట్స్ ఆ కేరెక్టర్‌ను చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చినా, అది స్పెక్యులేషన్‌గానే ఉండిపోయింది. అలాగే షూటింగ్‌లో జాప్యం కారణంగా మొదట ప్రకటించిన విధంగా 2020 జూలై 30న ఈ సినిమా విడుదలవడం కష్టమేననీ, 2021లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయనీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజమౌళి కానీ, నిర్మాత డీవీవీ దానయ్య కానీ ఇంతవరకు పెదవి విప్పలేదు. 

జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా 'అరవింద సమేత' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాని తర్వాత ఆయన నటిస్తోంది 'ఆర్ ఆర్ ఆర్'లోనే. అంటే 2019 సినిమాల్ కేలండర్‌లో ఆయన పేరు ఉండదు. ఇప్పటివరకూ ఆయన కెరీర్ చూసుకుంటే ఒక్క 2009లోనే ఆయన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. దాని తర్వాత సరిగ్గా పదేళ్లకు, 2019లోనూ ఆయన సినిమా విడుదలవడం లేదు. 'ఆర్ ఆర్ ఆర్' 2020లో రాకపోతే, కెరీర్‌లో వరుసగా రెండేళ్లు సినిమా విడుదల కాని స్థితిని ఆయన ఎందుర్కొంటున్నట్లే. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా.. అనే విషయమై యూనిట్ సభ్యుల్లోనే సందేహాలు వ్యక్తమవుతుండటం గమనించాల్సిన అంశం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.