నా మోకాళ్ల దెబ్బలకు కారణం ప్రభుదేవా: హీరోయిన్ ఆరోపణ!
on Nov 9, 2019
ప్రభుదేవా వల్ల తన మోకాళ్లకు దెబ్బలు తగిలాయని బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఆరోపించింది. అయితే అది సీరియస్గా కాదండోయ్! సరదాగానే. అయితే ఆమె మోకాళ్లకు దెబ్బలు తగలడం నిజమే. 'దబాంగ్ 3' మూవీ ఇంకా విడుదల కాకముందే సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ.. 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఇందులో హీరోయిన్గా దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే సల్మాన్, దిశా జంటగా సూపర్ హిట్ మూవీ 'భారత్'లో నటించారు. 'రాధే' సినిమా షూటింగ్ ఇటీవలే లాంఛనంగా మొదలైంది. డిసెంబర్లో 'దబాంగ్ 3' రిలీజ్ ఉండటంతో సల్మాన్ ఆ మూవీ ప్రమోషన్స్ను ప్లాన్ చెయ్యడంలో బిజీగా ఉన్నాడు. దాంతో ప్రభుదేవా ఆధ్వర్యంలో 'రాధే' సాంగ్స్ రిహార్సల్స్ చేస్తోంది దిశా. ఈ సందర్భంగా తన రెండు మోకాళ్లకు గాయాలయ్యాంటూ ఒక ఫొటోను షేర్ చేస్తూ తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేసింది దిశా.
ఆ ఫొటోలో వైట్ టీ షర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి రెండు కాళ్లను చాపి ఫ్లోర్పై కూర్చొని ఉంది దిశా. దానికి "ప్రభు సర్ డాన్స్తో నా మోకాళ్లకు గాయాలు" అనే క్యాప్షన్ పెట్టింది. 'రాధే' అనే హ్యాష్టాగ్ను కూడా దానికి జోడించింది. అదీ సంగతి! ప్రభుదేవా చెప్పిన ఒక డాన్స్ మూమెంట్ చేస్తూ, రెండు మోకాళ్లూ ఫ్లోర్కు గట్టిగా తగలడంతో వాటికి గాయాలయ్యాయన్న మాట. ఫాస్ట్ మూమెంట్స్కు ప్రభుదేవా కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. మంచి ఫిట్నెస్తో ఉండే దిశా సైతం వాటిని ప్రాక్టీస్ చేసే సమయంలో దెబ్బలు తగిలించుకుంది.
బాలీవుడ్ యాక్షన్ స్టార్, ఇటీవలే 'వార్' మూవీ వంటి బ్లాక్బస్టర్లో నటించిన టైగర్ ష్రాఫ్ గాళ్ ఫ్రెండ్గా దిశా పటాని వార్తల్లోకెక్కింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా 2015లో విడుదలైన 'లోఫర్' సినిమాతో హీరోయిన్గా ఆమె సినీ కెరీర్ మొదలవడం గమనార్హం. అందులో వరుణ్ తేజ్ జోడీగా ఆమె కనిపించింది. ఆ తర్వాతి యేడాదే బాలీవుడ్లో తన తొలి సినిమా చేసింది. అది.. 'ఎం.ఎస్. ధోని: ది అన్టోల్డ్ స్టోరీ'. నీరజ్ పాండే డైరెక్ట్ చెయ్యగా ధోని కేరెక్టర్ను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించిన ఆ మూవీ బ్లాక్బస్టర్ హిట్టయింది. ఆ మూవీలో ధోని గాళ్ ఫ్రెండ్ ప్రియాంకా ఝా అనే కేరెక్టర్ చేసి మెప్పించింది దిశా. అదే సినిమాలో ధోని భార్య సాక్షి పాత్రను కియారా అద్వానీ చేసింది.
తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్తో 'బాఘి 2'లో తొలిసారి నటించింది దిశా. 2018 మార్చిలో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. దాని తర్వాత సల్మాన్ సరసన ఆమె చేసిన 'భారత్' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో మనకు తెలుసు. ఆదిత్య రాయ్ కపూర్ జోడీగా ఆమె నటించిన 'మలంగ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే 'కెటీనా' అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కూడా ఆమె చేస్తోంది. ఇప్పుడు రెండోసారి సల్మాన్ జోడీగా 'రాధే'లో నటించే ఛాన్స్ కొట్టేసింది. 'భారత్'లో ఆమె చేసిన పర్ఫార్మెన్స్, పనిపై ఆమె డెడికేషన్ చూసిన సల్మాన్.. 'రాధే'లో అవకాశమిచ్చాడు. "సల్మాన్ నాకెప్పుడూ ఇన్స్పిరేషన్ ఇస్తుంటాడు. 'భారత్'లో ఆయనతో కలిసి పనిచెయ్యడం ఒక కల నిజమైనంత సంతోషాన్నిచ్చింది. 'రాధే' మూవీతో మరోసారి అలాంటి ఫీలింగే కలుగుతోంది" అని ఆమె చెప్పింది.
ఉత్తరాఖండ్కు చెందిన దిశా కాలేజ్ డ్రాపవుట్ కావడం గమనార్హం. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సెకండ్ యియర్లో ఉండగా, చదువు ఆపేసి మోడలింగ్లోకి వెళ్లింది.