రానాకు ఆమె 'యస్' చెప్పింది!
on May 12, 2020
టాలీవుడ్ హంక్గా పేరుపొందిన రానా త్వరలో వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. అతడి ప్రపోజ్కు హైదరాబాద్లోని ఈవెంట్ కంపెనీ 'డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోస్' అధినేత్రి మిహీకా బజాజ్ యస్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రానా స్వయంగా వెల్లడించాడు. ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేసిన రానా "And she said Yes" అంటూ ఒకే వాక్యాన్ని పోస్ట్ చేశాడు. దీంతో రానాకు అభినందనలు వెల్లువెత్తాయి. క్షణాల వ్యవధిలోనే అతడి ట్వీట్ను వేలాది మంది లైక్ చేయగా, వందలాది మంది రిట్వీట్ చేశారు. అతి త్వరలోనే ఆ ఇద్దరి నిశ్చితార్థం జరగనున్నది. మిహీకా తల్లి బంటీ బజాజ్ పేరు పొందిన జ్యువెలరీ డిజైనర్. 'క్రిసాలా' నగల దుకాణాలు ఆమెవే.
35 సంవత్సరాల రానా టాలీవుడ్లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకడిగా పేరుపడ్డాడు. తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్లో అడుగుపెట్టి 'దమ్ మారో దమ్', 'డిపార్ట్మెంట్', 'బేబీ' వంటి సినిమాల్లో నటించాడు. రాజమౌళి సినిమా 'బాహుబలి'లో చేసిన విలన్ క్యారెక్టర్ భల్లాలదేవ అతడికి అమిత కీర్తిని తీసుకొచ్చింది. 'హాథీ మేరే సాథీ' (తెలుగులో 'అరణ్య') విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో పాటు సాయిపల్లవి జోడీగా నటిస్తోన్న 'విరాటపర్వం' చిత్రం ముగింపు దశలో ఉంది.
Also Read