'ఆర్ఆర్ఆర్' లేటెస్ట్ అప్డేట్: తారక్ను తీవ్రంగా కొట్టిన చరణ్!
on Feb 12, 2020
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ఏదంటే, ఎవరైనా ఠక్కున చెప్పే పేరు 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' వంటి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై అందరి దృష్టీ ఉండటం సహజం. దానికి తగ్గట్లే ఆ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఊహాతీతంగా జరుగుతోంది. ఒక్క ఇండియాలోనే 400 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.
కాగా ఈ సినిమా అప్డేట్స్ కోసం తారక్, చరణ్, రాజమౌళి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, అందరు హీరోల ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న లీక్ వచ్చినా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ వస్తోంది. లేటెస్టుగా ఒక అప్డేట్ 'తెలుగుఒన్' దృష్టికి వచ్చింది. అది తారక్, చరణ్.. ఇద్దరూ పాల్గొనే ఒక ఎపిసోడ్కు సంబంధించింది. ఆ ఎపిసోడ్లో కొరడాతో చరణ్ కొడుతూ ఉంటే, తారక్ శరీరమంతా రక్తసిక్తం అవుతుందని విశ్వసనీయ సమాచారం. ఆ సన్నివేశం చాలా బీభత్సంగా ఉంటుందని, చూసే ప్రేక్షకుల హృదయాలు ఆవేదనతో నిండిపోతాయని తెలుస్తోంది. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపిస్తాడని రాజమౌళి ప్రకటించడం మనకు తెలుసు. అయితే తారక్ను కొరడాతో హింసించే సన్నివేశంలో చరణ్.. బ్రిటిష్ సార్జంట్గా కనిపించనుండటం ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్విస్ట్!
అసలు తారక్ను చరణ్ ఎందుకు కొడతాడు? ఆ సందర్భం ఏమిటి? 'తెలుగుఒన్'కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తారక్ ఒక బ్రిటిష్ అధికారి భవంతిలోకి అనుమతి లేకుండా ప్రవేశిస్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే తన బ్రిటిష్ ప్రేయసి కోసం ఆ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడి మనుషుల కంటపడి, దొరికిపోతాడు. దాంతో బ్రిటిష్ అధికారి తారక్ను బంధించి, అనుమతిలేకుండా తన ఇంట్లోకి ప్రవేశించినందుకు గాను కొరడాతో కొట్టే శిక్ష విధిస్తాడు. ఆ శిక్షను జనం మధ్య అమలు చేస్తారు. ఒక కూడలిలో ఒక పెద్ద దుంగకు తారక్ను కట్టగా, సార్జంట్గా పనిచేస్తున్న చరణ్ వచ్చి కొరడాతో తారక్ను కొడతాడు. తారక్ శరీరమంతా రక్తం ధారలు కడుతుంది. ఆ సందర్భంగా అతను పాట కూడా పాడతాడు. ఈ ఒక్క ఎపిసోడ్ను గండిపేట దగ్గర వేసిన సెట్లో 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో 20 రోజుల పాటు చిత్రీకరించారు.
'ఆర్ఆర్ఆర్'లోని హైలెట్ ఎపిసోడ్స్లో ఇదొకటని తెలిసింది. ఇందులో తారక్ బ్రిటిష్ ప్రేయసిగా ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, ఆమె తల్లిదండ్రులైన బ్రిటిష్ దంపతులుగా రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడీ నటిస్తున్నారు. సీతారామరాజు తిరుగుబాటు యోధునిగా మారక ముందు ఇంటి నుంచి వెళ్లిపోయి మూడేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపి, తిరిగివచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అజ్ఞాతవాసంలో ఆయన ఏం చేశాడనే దానిపై రకరకాల కథనాలు ఉన్నాయి కానీ, వాటిలో దేనికీ విశ్వసనీయత లేదు. 'ఆర్ఆర్ఆర్'లో ఆ అజ్ఞాతవాసంలో కొన్నిరోజులు రామరాజు బ్రిటిష్ సార్జంట్గా పనిచేసినట్లు చూపిస్తున్నారని తెలుస్తోంది. తారక్ను కొట్టే సన్నివేశం తర్వాతే అతనిలో మార్పు వచ్చి, ఆ ఉద్యోగాన్ని వదిలిపెడతాడని మనం ఊహించవచ్చు. అదే తరహాలో కొమరం భీమ్ ఒక బ్రిటిష్ యువతి ప్రేమలో పడి చిక్కులు తెచ్చుకుంటాడని కూడా చూపిస్తున్నారు.
సినిమా మొదట్లోనే.. "ఇది చరిత్రలోని పాత్రలతో అల్లిన కల్పిత కథ. ఇందులో చిత్రించిన సన్నివేశాలన్నీ కల్పితం" అంటూ డిస్క్లైమర్ వేస్తారు కాబట్టి, ఎవరూ ఈ సన్నివేశాల్నీ, ఈ కల్పిత కథనీ ఆక్షేపించరని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతున్న 'ఆర్ఆర్ఆర్'ను 2021 జనవరి 8న విడుదల చేయాలని సంకల్పించినట్లు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆకర్షణీయమైన, అలరించే సన్నివేశాలతో, పాత్రలతో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టెక్నికల్ వాల్యూస్తో తయారవుతున్న ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'బాహుబలి 2'ను మించి మరో చరిత్రను లిఖిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read