మంచు ఫ్యామిలీ మెగా జపం!
on Mar 6, 2020
కొంత కాలం క్రితం వరకు ఉప్పు-నిప్పులా ఉన్న చిరంజీవి, మోహన్బాబు.. ఇటీవల పాలు-నీళ్ల మాదిరి కలిసిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మంచు ఫ్యామిలీ అంతా ఇప్పుడు మెగా జపం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మీటింగ్ రాజశేఖర్ ప్రవర్తన కారణంగా రసాభాస అయిన విషయం తెలిసిందే. అదే మీటింగ్లో చిరంజీవిని, మోహన్బాబు ఆలింగనం చేసుకోవడమే కాకుండా, మోహన్బాబు కోరిక మేరకు చిరంజీవి ఆయనను ముద్దు పెట్టుకోవడం మనం చూశాం. దానికి ముందు కొన్ని సందర్భాల్లో చిరంజీవిని పొగుడుతూ మోహన్బాబు మాట్లాడారు.
అలాగే ఇటీవల తన చిన్నతనంలో తమ రెండు కుటుంబాలు ఎంత సన్నిహితంగా మెలిగేవో, పిల్లలందరం ఎంత సరదాగా గడిపేవాళ్లమో మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. చిరంజీవి, మోహన్బాబు కలిసి నటించిన సినిమాల్లో ఔట్డోర్ షూటింగ్ అప్పుడు తాము కూడా అక్కడకు వెళ్లి ఆ రోజుల్ని బాగా ఆస్వాదించేవాళ్లమని ఆమె తెలిపింది.
లేటెస్ట్గా శుక్రవారం మంచు మనోజ్ సినిమా ఓపెనింగ్కు రామ్చరణ్ వెళ్లి క్లాప్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చరణ్ను తన సోదరునిగా, తన సన్నిహిత స్నేహితునిగా మనోజ్ ప్రస్తావించాడు. తనపై తీసిన ఫస్ట్ షాట్కు చరణ్ క్లాప్ కొట్టడం చాలా ఆనందాన్నిచ్చిందని అతను చెప్పాడు. అదే ప్రోగ్రామ్లో చరణ్ మెడలో దండవేసిన మోహన్బాబు, ఈ మాల దేవుడికి కాదు, మా బిడ్డ రామ్చరణ్కు అనడం గమనార్హం. చరణ్తో పాటు ఈ కార్యక్రమంలో అతని సోదరి సుస్మిత కూడా పాల్గొన్నది. వీటిని బట్టి మంచు కుటుంబం, కొణిదెల కుటుంబం ఒకప్పటిలా మళ్లీ సన్నిహితమయ్యాయనేది స్పష్టం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
