చరణ్ - శంకర్ చిత్రం.. కాన్సెప్ట్ అదేనా?
on Sep 16, 2021
సామాజిక సందేశానికి సాంకేతికతను జోడించి జనరంజకంగా సినిమాలను తీయడంలో దిట్ట.. దర్శకుడు శంకర్. తమిళనాట తిరుగులేని నిర్దేశకుడిగా రాణించిన శంకర్.. తొలిసారిగా తెలుగునాట ఓ స్ట్రయిట్ పిక్చర్ తెరకెక్కిస్తున్నారు. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని దర్శనమివ్వనుంది. సునీల్, జయరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. చరణ్ - శంకర్ కాంబో మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ``కార్పోరేట్ వ్యవస్థలు భారతీయ చట్టాల్ని అడ్డుపెట్టుకుని ఎలా ఎదుగుతున్నాయి? సామాన్యులు దీని వల్ల ఎలా నష్టపోతున్నారు?`` అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ చిత్రం తెరకెక్కనుందట. అంతేకాదు.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో చరణ్ కలెక్టర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, చరణ్ - శంకర్ కాంబో మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.