ENGLISH | TELUGU  

మొరగని కుక్క లేదు.. అర్థమైందా రాజా.. వైసీపీ నేతలకు రజినీకాంత్ చురకలు!

on Aug 9, 2023

దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. అయినప్పటికీ ఆయనలో ఆ అహం ఉండదు. అందరితో మంచిగా ఉంటారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ ఉంటారు. అలాంటి రజినీకాంత్ కి కోపం వచ్చింది. "కుక్కలు మొరుగుతుంటాయి.. మన పని మనం చేసుకుంటూ పోవాలి" అంటూ పరోక్షంగా కొందరికి చురకలు అంటించారు. అయితే రజినీకాంత్ కోపానికి కారణం.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

రజినీకాంత్ కి తెలుగులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో మంచి అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడుతో, నందమూరి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ అనుబంధంతోనే ఈ ఏడాది ఏప్రిల్ 28 న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గొప్పతనాన్ని వివరించారు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుది అని, ఆయన గొప్ప విజనరీ ఉన్న నాయకుడని, ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని కొనియాడారు. ఈ మాటలు ఏపీ అధికార పార్టీ నేతలకు నచ్చలేదు. నిజానికి ఆ వేడుకలో రజినీకాంత్ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. తన స్నేహితుడు చంద్రబాబు ఎంత గొప్ప నాయకుడో చెప్పే ప్రయత్నం చేశారు అంతే. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రజినీకాంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న హీరోని పట్టుకొని నువ్వు హీరోనా అంటూ చులకన చేశారు. కొడాలి నాని మొదలుకొని పోసాని కృష్ణమురళి వరకు ఎందరో రజినీకాంత్ పై విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పట్ల అలా విమర్శలు చేయడాన్ని మేధావులు, స్వతంత్రులు సైతం తప్పుబట్టారు. అయితే ఇంతకాలం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్న రజినీకాంత్.. తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమా వేడుకలో ఆయన మాట్లాడుతూ.. "మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అంటూ చురకలు అంటించారు. మొదటి వాక్యాలను తమిళ్ లో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం 'అర్థమైందా రాజా' అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే 'రాజా రాజా' అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ నడుస్తోంది.

రీసెంట్ గా చిరంజీవి సైతం సినిమా వాళ్ళపై మీ ప్రతాపం చూపించడం మానేసి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని ఏపీ ప్రభుత్వానికి చురకలు వేశారు. దీంతో మొన్నటిదాకా చిరంజీవిని పొగిడిన అధికార పార్టీ నేతలే.. ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్నారు. ఓ వైపు విపక్షాలు అందరినీ కలుపుకొని పోతూ రోజురోజుకీ బలపడుతుంటే.. ఇప్పటికే రాజధాని పరంగా, అభివృద్ధి పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ మాత్రం.. తన గోతిని తానే తవ్వుకున్నుట్లుగా నాయకుల నోటి తీరుతో అందరికీ దూరమవుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన గ్రాఫ్ ని మరింత పడిపోయేలా చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.