తన నెక్స్ట్ మూవీ కోసం ముగ్గురు హీరోలు రెడీ.. షాక్ ఇచ్చిన రాజమౌళి?
on Apr 28, 2025
బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ సినిమాల తర్వాత చాలా టైమ్ తీసుకొని సూపర్స్టార్ మహేష్తో రాజమౌళి ఓ అడ్వంచరస్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి వర్కింగ్ స్టైల్కి భిన్నంగా ఈ చిత్రాన్ని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. పూర్తి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ సినిమాలో ఆడియన్స్ని థ్రిల్ చేసే అంశాలు చాలా వుంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తన డ్రీమ్ ప్రాజెక్ట్గా రాజమౌళి చెప్పుకునే మహాభారతం చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన జీవితంలో మిగిలిన వున్న ఏకైక లక్ష్యం మహాభారతాన్ని బిగ్ రేంజ్లో తెరకెక్కించడం అనే విషయాన్ని పలుమార్లు మీడియా ముఖంగా తెలిపారు రాజమౌళి. ఈ సినిమా చేయడానికి తనకు మరింత సమయం కావాలని, ఇప్పుడు తనకున్న అనుభవం ఆ దృశ్యకావ్యాన్ని తీసేందుకు సరిపోదని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, అది ఒక్క భాగంతో పూర్తయ్యే సినిమా కాదని, కనీసం నాలుగైదు భాగాలుగా తియ్యాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి రాజమౌళి మహాభారతం ప్రాజెక్ట్ వార్తల్లోకి ఎక్కింది.
తాను కొందరు స్టార్ హీరోలను ఎప్పటికీ వదులుకోలేనని రాజమౌళి చెప్పడంతో మహాభారతం గురించే ఈ వ్యాఖ్యలు చేశారని అంతా అనుకుంటున్నారు. రాజమౌళి మాటల్ని బట్టి చూస్తే మహాభారతం కోసం ఇప్పటికే ముగ్గురు హీరోలను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా నాని హీరోగా నటించిన హిట్3 ఈవెంట్లో రాజమౌళి తన సినిమాలో నాని నటిస్తాడని చెప్పడంతో మహాభారతం కోసం ముగ్గురు హీరోలు కన్ఫర్మ్ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు. అంతకుముందు రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూల్లో మహాభారతం గురించి ప్రస్తావించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్ను ఎంపిక చేసుకుంటానని చెప్పారు. శ్రీకృష్ణుడిలో ఉన్న గంభీరం, చమత్కారం వంటి అంశాలను అద్భుతంగా పలికించగల నటుడు ఎన్టీఆర్ అని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా చూపించాలన్నది తన కల అని పేర్కొన్నారు. అలాగే మహాభారతంలోని కర్ణుడి పాత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ పాత్ర గంభీరంగా ఉండడమే కాకుండా, ఎమోషనల్గా కూడా ఉంటుంది. ప్రభాస్ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అవుతాడని, అతని పెర్ఫార్మెన్స్తో కర్ణుడి పాత్ర పది కాలాలపాటు గుర్తుపెట్టుకునేలా ఉంటుందని అన్నారు.
తాజాగా హిట్3 ఈవెంట్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్కి సంబంధించిన మరో హింట్ ఇచ్చారు రాజమౌళి. తను మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించే పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్లో నాని ఉంటాడని అన్నారు. అయితే మహాభారతంలో నానికి ఏ క్యారెక్టర్ ఇస్తారు అనే విషయాన్ని మాత్రం క్లారిఫై చెయ్యలేదు. ఇప్పటి వరకు మహాభారతం చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్, ప్రభాస్, నానిలను రాజమౌళి కన్ఫర్మ్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే మహాభారతం చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లడం అంత ఆషామాషీ విషయం కాదు అనేది రాజమౌళికి కూడా తెలుసు. అందుకే తను దర్శకుడిగా రిటైర్ అయ్యే లోపు ఆ ప్రాజెక్ట్ చేస్తానని చెప్తున్నారు. అయితే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనే విషయం మాత్రం ఎవరూ చెప్పలేరు. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించడం తన లక్ష్యమని గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకొస్తున్నారు. ఇటీవల మరోసారి ఆ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు ఆమిర్ ఖాన్. అయితే దానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చెయ్యడానికే కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదే ఆ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
