'విరాట పర్వం' కథ విని క్షణాల్లో 10 లక్షల చెక్ ఇచ్చారు
on Jan 27, 2022
శ్రీవిష్ణు ప్రధానపాత్రలో నటించిన 'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల మొదటి సినిమాతోనే మంచి గురింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో సినిమా 'విరాట పర్వం'. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మొదటి సినిమా విడుదల కాకముందే దర్శకుడిగా రెండో సినిమా అవకాశం వచ్చిందని వేణు తెలిపారు. "నీది నాది ఒకే కథ సినిమా సెన్సార్ అయిన తర్వాత విడుదలకి రెండు రోజుల ముందు.. సినిమా బాగుందని, ఈ సినిమా దర్శకుడికి మంచి భవిష్యత్ ఉందంటూ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. దాంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ నుంచి పిలుపు వచ్చింది. అలా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారిని కలిశాను. ఆయనకు 'విరాట పర్వం' స్టోరీ లైన్ చెప్పగానే, క్షణాల్లో రూ.10 లక్షలు చెక్ రాసి ఇచ్చారు. ఆ చెక్ ని చాలారోజులు మార్చకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను. చాల ఆనందంగా అనిపించింది" అని వేణు చెప్పుకొచ్చారు.
'ప్రేమమ్' సినిమా టైం నుంచి సాయి పల్లవి అంటే ఇష్టమని వేణు అన్నారు. మొదటి సినిమాకే సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నామని, కానీ కుదరలేదని తెలిపారు. విరాటపర్వంలో వెన్నెల పాత్రకు సాయిపల్లవిని తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేదని చెప్పారు. సుధాకర్ గారి ద్వారా సాయి పల్లవిని కలవగా ఆమె సింగల్ సిట్టింగ్ లోనే సినిమాని ఒకే చేశారని అన్నారు. సురేష్ బాబు గారు, రానా, సాయి పల్లవి ఇలా ఈ ప్రాజెక్ట్ లో భాగమైన అందరూ కూడా సింగల్ సిట్టింగ్ లోనే కథని ఒకే చేశారని తెలిపారు. రానా, సాయి పల్లవి ఇద్దరి పాత్రలూ విరాటపర్వంకి ఇంపార్టెంట్ అని అన్నారు. రాముడు, సీత ఇద్దరూ ఉంటేనే రామాయణం సంపూర్ణం అవుతుందని, అలాగే విరాటపర్వం సినిమా ఈ ఇద్దరి పాత్రలు ఉంటేనే సంపూర్ణమవుతుందని వేణు వివరించారు.