ప్రియమణి ఆ సెలబ్రిటీ చెంప ఛెళ్లుమనిపించిందా?
on Apr 8, 2020
వివాదాలకు దూరంగా ఉండే తారల్లో ప్రియమణి ఒకరు. కొన్ని సందర్భాల్లో ఆమెపై వచ్చిన వదంతులు ఆశ్చర్యం కలిగించాయి. అలాంటి ఒక సందర్భం దేశంలోని అన్నిభాషల నటులు కలిసి ఆడిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆమె అంబాసిడర్గా వ్యవహరించినప్పుడు తటస్థించింది. ఒక సెలబ్రిటీ క్రికెటర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ అప్పట్లో రూమర్ వ్యాపించింది. ప్రియమణిని అతడు అభ్యంతరకరంగా తాకాడనీ, దాంతో ఆమె అతడి చెంప ఛెళ్లుమనిపించిందనీ చెప్పకున్నారు. దేశవ్యాప్తంగా నటుల ఐకమత్యాన్ని చాటిచెప్పడానికి ఏర్పాటుచేసిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు ఈ ఘటన మచ్చ తెచ్చిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినవచ్చాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు అవి కేవలం వదంతులేననీ చెప్పింది ప్రియమణి. "అప్పుడు సరిగ్గా ఏం జరిగిందో చెబుతాను. ఎవరో పరాచికాలు ఆడటానికి నా మొబైల్ దాచారు. ఆ మొబైల్ నాది కూడా కాదు, నా బ్రదర్ది. అప్పుడప్పుడు దాన్ని నేను వాడుతుంటాను. మొబైల్ కనిపించకపోవడంతో కంగారు పడి, హోటల్ స్టాఫ్నందర్నీ దాని విషయం అడిగాను. చివరకు ఆ మొబైల్ దాచిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అది తన దగ్గర ఉందనీ, సరదా కోసమే అలా చేశాననీ చెప్పాడు. అలాంటి పనులు చేయవద్దనీ, అది కరెక్ట్ కాదనీ అతనికి చెప్పాను. అవును. కాస్త మందలింపుగానే చెప్పాను" అని ఆమె వివరించింది.
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగినప్పటికీ ఆ సెలబ్రిటీ పేరు వెల్లడించలేదు ప్రియమణి. అది ఆమెలోని మంచితనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. మొత్తానికి అప్పుడు వచ్చిన గాసిప్కు అలా చెక్ చెప్పింది ప్రియమణి.