ముస్తఫా రాజ్కు ప్రియమణి రెండో భార్య! వారి వివాహం చెల్లదని మొదటి భార్య కేసు!!
on Jul 22, 2021
లేటెస్ట్గా 'నారప్ప' మూవీలో సుందరమ్మ పాత్రతో ఆడియెన్స్ను ఆకట్టుకున్న ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్ను 2017లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారి వివాహం కోర్టులో న్యాయపరమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ముస్తఫాకు ప్రియమణి మొదటి భార్య కాదు, రెండో భార్య! వారి వివాహాన్ని ప్రశ్నిస్తూ ముస్తఫా మొదటి భార్య ఆయేషా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఇప్పటివరకూ చట్టబద్ధంగా తాము విడిపోలేదనీ, అందువల్ల వారి వివాహం అక్రమమనీ ఆమె ఆరోపించారు.
ముస్తఫా, ఆయేషాలకు ఇద్దరు పిల్లలు కూడా. ముస్తఫాపై ఆయేషా గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు.ప్రస్తుతం ఆ కేసు మేజిస్ట్రేట్ కోర్టులో ఉంది. "ముస్తఫా ఇప్పటికీ నా భర్తే. ముస్తఫా, ప్రియమణిల వివాహం చెల్లదు. మేం కనీసం విడాకులకు దరఖాస్తు కూడా చేసుకోలేదు. ప్రియమణిని పెళ్లిచేసుకొనేటప్పుడు తాను అవివాహితుడినని ఆయన కోర్టులో ప్రకటించాడు." అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు ఆయేషా.
ఆయేషా తనపై చేస్తున్న ఆరోపణలు తప్పుడువని ముస్తఫా అన్నాడు. "ఆయేషాకు నేను రెగ్యులర్గా పిల్లల పోషణ నిమిత్తం డబ్బు చెల్లిస్తూనే ఉన్నాను. నా నుంచి డబ్బులు గుంజడానికి ఆమె ప్రయత్నిస్తోంది." అని అతను సమర్థించుకున్నాడు. 2010 నుంచే తాము విడివిడిగా జీవిస్తున్నామనీ, 2013లో తాము విడాకులు తీసుకున్నామనీ ముస్తఫా చెప్పాడు. "ప్రియమణితో నా పెళ్లి 2017లో జరిగింది. ఇంతకాలం ఆయేషా ఎందుకు మౌనంగా ఉంది?" అని అతను ప్రశ్నించాడు.
Also Read