ENGLISH | TELUGU  

సీక్వెల్ చాన్స్: 'అల.. వైకుంఠపురములో' క్లైమాక్స్ చెబుతున్నదేమిటి?

on Feb 17, 2020

 

కొన్ని సినిమాల క్లైమాక్స్ చూస్తే, దానికి సీక్వెల్ ఉంటుందనీ, తీస్తే బాగుంటుందనీ అనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్ అయిన సినిమాకైతే నిజంగానే ప్రేక్షకులు సీక్వెల్‌ని ఆశిస్తారు కూడా. 'బాహుబలి' విషయానికి వస్తే, 'బాహుబలి 2' సీక్వెల్ కాదు. అది రెండు భాగాల సినిమా. ఆ విషయాన్ని ముందుగానే మేకర్స్ చెప్పారు. 'బాహుబలి' కథ మధ్యలోనే ఆగిపోవడం వల్ల అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చూడాలని రెండో భాగం కోసం మనం ఎదురు చూశాం. ఆ తరహా కథలు వేరు. సీక్వెల్ అంటే ఒరిజినల్‌లోని ప్రధాన పాత్రలని కొనసాగిస్తూ ఇంకో కథతో ఇంకో సినిమాని తియ్యడం.

'అల వైకుంఠపురములో' సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు మనకు అక్కడ్నుంచి ఇంకో సినిమా తీయొచ్చనే అభిప్రాయం కలుగుతుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన ఆ మూవీ ఆ ఇద్దరి కెరీర్లలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలుచుంది కాబట్టి సీక్వెల్ డిమాండ్ బన్నీ ఫ్యాన్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. 'అల.. వైకుంఠపురములో' కథలోకి వెళ్తే.. బంటూ ఒక సంపన్న దంపతులకు పుడతాడు కానీ, వాళ్ల కంపెనీలో పనిచేసే వాల్మీకి అనే ఒక మధ్యతరగతి క్లర్క్, జెలసీతో పిల్లల్ని తారుమారు చేస్తాడు. దాంతో బంటూ ఆ గుమస్తా కొడుకుగా పెరుగుతాడు. క్లర్క్ అసలు కొడుకు సమన్నుడిగా ఎదుగుతాడు. సినిమా మధ్యలో తన అసలు తల్లిదండ్రులెవరో బంటూకు తెలుస్తుంది. పెంచిన తండ్రిమీద విపరీతమైన కోపం కలుగుతుంది. అయితే తన జన్మ రహస్యాన్ని అతడెక్కడా బయటపెట్టడు.

ఇప్పుడు క్లైమాక్స్‌లోకి వద్దాం. బంటూ ఎవరో అతని అసలు తాతయ్యకు, తండ్రికీ తెలిసిపోతుంది. కానీ తన తల్లికి ఆ విషయం తెలుపవద్దని వాళ్ల దగ్గర మాట తీసుకుంటాడు బంటూ. క్రూరుడైన ప్రత్యర్థి నుంచి వచ్చే ఒక చిక్కు సమస్యలోంచి ఆ కుటుంబాన్ని, వాళ్ల ఆస్తుల్ని రక్షిస్తాడు. అంతదాకా బంటూ మీద కోపంతో ఉండే అతని తల్లి, అతను తమ కుటుంబానికి చేసిన సాయంతో మనసు కరిగి, అతడికి విలువనిస్తుంది. ఆస్తిలో వాటా కూడా ఇస్తుంది. ఆమెకు చివరిదాకా తన అసలు కొడుకు బంటూ అనే విషయం తెలీదు. సీక్వెల్ తియ్యడానికి ఇంతకంటే ప్లాట్ పాయింట్ ఇంకేముంటుంది! దీన్ని బేస్ చేసుకొని సీక్వెల్ తీయొచ్చని చాలామంది అభిప్రాయపడతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సీక్వెల్ కోసం ఇష్టంగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సీక్వెల్ ఎలా ఉంటే బాగుంటుందో కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒక ఊహ ప్రకారం ఆ సీక్వెల్‌లో బంటూ తన కొడుకని ఆ తల్లికి తెలుస్తుంది. ఆమెకు ఆ విషయం తెలిసిపోయిందనే విషయం బంటూకు తెలియదు. తన భర్త, తన తండ్రి తనకు ఈ రహస్యం చెప్పకుండా దాచారని తెలిశాక ఆమె ఏం చేస్తుంది? నిజం తెలిసి ఆ తల్లి హృదయం ఎలా తల్లడిల్లుతుంది? దీనిపై స్క్రీన్‌ప్లే అల్లి, ప్రి క్లైమాక్స్‌లో బంటూకు ఆ విషయం తెలిసేలా చేస్తే, కథ రక్తికడుతుందని సీక్వెల్ కథను ఊహిస్తున్నవాళ్లు చెప్పేమాట. అలాగే ఇంకో ఊహ కూడా ప్రచారంలోకి వచ్చింది. సీక్వెల్ కథలో ఒక కొత్త విలన్ వస్తాడు. బంటూ పెంపుడి తండ్రివల్ల అతడికి బంటూ ఎవరో తెలుస్తుంది. ఇంటర్వెల్‌లో ఆ విలన్ వల్లే బంటూ తల్లికి కూడా ఈ రహస్యం తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలా స్పందించింది? కన్నకొడుకు పరాయివాడిలా తన ముందు ప్రవర్తిస్తుంటే.. ఆమె గుండె ఎలా తల్లడిల్లింది?.. చివరకు ఆ తల్లీకొడుకులు ఎలా దగ్గరయ్యారు?.. అనేది చూపిస్తే బాగుంటుందని ఊహిస్తున్నారు.

ఈమధ్య కాల్యంలో ఒక తెలుగు సినిమాకు సంబంధించి సీక్వెల్ తీస్తే బాగుంటుందనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి రావడం ఇదే. అంతేకాదు.. ఆ కథ ఎలా ఉంటే బాగుంటుందో కూడా ఊహాగానాలు రావడం కూడా ఇప్పుడే. 'అల.. వైకుంఠపురములో' మూవీకి ఆ స్కోప్ ఉందనీ, సీక్వెల్ తీస్తే అది కూడా బంపర్ హిట్ అవుతుందనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే బన్నీ 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు చేసిన విషయాన్నీ వాళ్లు ప్రస్తావిస్తున్నారు. 'ఆర్య'లోని మూడు ప్రధాన పాత్రలు.. ఆర్య, అజయ్, గీత పాత్రల్ని తీసుకొని, ఒక కొత్త కథతో ఆ సినిమా తీశాడు సుకుమార్. నిజానికి 'ఆర్య' కథకూ, 'ఆర్య 2' కథకూ ఎలాంటి సంబంధం ఉండదు. కానీ, 'అల.. వైకుంఠపురములో' పాత్రలతో పాటు, కథనీ కొనసాగించే అవకాశం సీక్వెల్‌లో ఉంది. అందుకే బన్నీ దానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందని వాళ్లు కోరుతున్నారు. మరి త్రివిక్రమ్ మనసులో ఏముందో.. అతను సీక్వెల్ గురించి ఆలోచిస్తాడో, లేదో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.