ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్'!
on Oct 28, 2022
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తమిళ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-1'. సెప్టెంబర్ 30న భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది.
ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో అద్దె ప్రాతిపదికన 'పొన్నియిన్ సెల్వన్-1' అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల తర్వాత అంటే నవంబర్ 4 నుంచి ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ ఎటువంటి అద్దె చెల్లించకుండానే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. అంటే థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా ఐదు వారాలకు ఈ చిత్రం పూర్తిస్థాయిలో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతుందన్నమాట.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. 'పొన్నియిన్ సెల్వన్-2' వచ్చే ఏడాది విడుదల కానుంది.