చిరంజీవి-మోహన్బాబు 'పట్నం వచ్చిన పతివ్రతలు' విడుదలై నేటికి 40 ఏళ్లు
on Oct 1, 2022
చిరంజీవి, మోహన్బాబు హీరోలుగా కలిసి నటించిన సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. అలాంటి వాటిలో ఒకటైన 'పట్నం వచ్చిన పతివ్రతలు' నలభై సంవత్సరాల క్రితం ఇదే తేదీన విడుదలైంది. మౌళి దర్శకత్వం వహించిన ఈ వినోదాత్మక కుటుంబ కథాచిత్రాన్ని శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో చిరంజీవి జోడీగా రాధిక, మోహన్బాబు జంటగా గీత నటించారు. కన్నడంలో వచ్చిన 'పట్టణక్కె బంద పత్నియరు' అనే సినిమాకు ఇది రీమేక్.
చిన్నతనంలోనూ అమ్మానాన్నలను కోల్పోయిన ఇద్దరు అన్నదమ్ములు మోహన్ (మోహన్బాబు), గోపి (చిరంజీవి)లను బామ్మ నారాయణమ్మ (నిర్మలమ్మ) పెంచి పెద్దచేస్తుంది. చదువు అబ్బని మోహన్కు చదువుకున్న దేవి (గీత)తో, బీఎస్సీ చదివిన గోపికి చదువుకోని పల్లెటూరి అమ్మాయి లలితాంబ (రాధిక)తో పెళ్లి జరిపిస్తుంది. పట్నంలో కాపురం పెడదామని మోహన్, గోపిలను భార్యలు సతాయిస్తుంటారు. కానీ వాళ్లు బామ్మనూ, పల్లెనూ విడిచిపెట్టడానికి ఇష్టపడరు. దాంతో ఒకరోజు భర్తలకు చెప్పాపెట్టకుండా పట్నంలో ఉండే తమ స్నేహితురాలు శకుంతల దగ్గరకు వెళ్లాలని బయలుదేరుతారు. స్నేహితురాలి అడ్రస్ తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ ఇద్దరూ గంగాదేవి అనే వ్యభిచార గృహ నిర్వాహకురాలి కంట్లో పడతారు. భార్యలను వెతుక్కుంటూ పట్నం వచ్చిన మోహన్, గోపి ఎలా వారిని కాపాడుకున్నారనేది పతాక సన్నివేశం.
హైదరాబాద్లోని సుభాష్ థియేటర్లో వంద రోజులు ఆడిన 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, వరంగల్లోని ఒక్కో థియేటర్లో 50 రోజులు ఆడింది. రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, రమాప్రభ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. "అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది" అనే నూతన్ ప్రసాద్ ఫేమస్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. చురుకుదనం, చలాకీదనం ఉండే యువకుడిగా చిరంజీవి, అమాయకత్వం నిండిన యువకుడిగా మోహన్బాబు ప్రేక్షకుల్ని అలరించారు. సత్యం సంగీతం సమకూర్చిన ఈ సినిమా 1982 అక్టోబర్ 1న విడుదలైంది.
Also Read