ENGLISH | TELUGU  

లక్ష్మీస్ వీరగ్రంథం!

on Oct 25, 2017

తెలివితేటలు ఎవరి సొంతం చెప్పండి? తాడి ఎక్కేవాడు ఒకటుంటే... వాడి తల తన్నే వాడు మరొకడుంటాడు. ఎన్టీయార్ బయోపిక్ ల వ్యవహారం చూస్తుంటే... ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. పాపం... ముందు బాలయ్య.. వాళ్ల నాన్న బయోపిక్ తీయాలని అనుకున్నాడు. ఆ కథను తీసే మగాడు ఎవరూ లేరన్నట్టు... పోయి పోయీ... రామ్ గోపాల్ వర్మను కదిలించాడు. ఇంకేముందు.. తేనె పట్టుని కదిలించినట్టయ్యింది. ఆ మరుసటి రోజే... ఓ పాటను రికార్డ్ చేసేసి.. సోషల్ మీడియాకు వదిలేశాడు వర్మ. ఆ పాట.. ఆ హడావిడి చూసి... ఎన్టీయార్ అభిమానులందరూ హడలి చచ్చారు. వామ్మో.. ఇప్పుడు ఈయనగారు తీస్తే... అన్నగారి జీవితం ఏమవుతుందో అని భయపడిపోయీ... బాలయ్యతో మనవి చేసుకోవడం మొదలెట్టారు. వీరికి తోడు ఇంట్లో నుంచి కూడా షంటింగులు మొదలవ్వడంతో... వర్మను పక్కనపెట్టేశాడు  బాలయ్య.

అద్గదీ... అప్పట్నుంచి మొదలైంది అసలైన కథ.. కొన్ని రోజులు వర్మ మౌనంగానే ఉన్నాడు. ‘ఎన్టీయార్ బయోపిక్ కు తేజా దర్శకుడు’ అని ఓ రూమర్(అప్పట్లో) చక్కర్లు కొట్టడం మొదలైంది. ఈ వార్త విని వర్మగారికి మండుకొచ్చింది. ఇక వేరే ఆలోచన చేయకుండా... ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ టైటిల్ ని ఎనౌన్స్ చేసేశాడు. నిజానికి ఈ టైటిల్ ను వర్మ ప్రకటించినప్పుడు..  ఈ కథపై వర్మకు క్లారిటీ లేదు. పైగా.. నిర్మాత కూడా లేడు. ఎప్పుడైతే.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అని ప్రకటించాడో... వెంటనే.. వైసీపీ వాళ్లు రంగంలో దిగారు. రాజకీయ పార్టీలకు డబ్బుకు కొదవేం ఉంటుంది చెప్పండి. వైసీపీ లీడర్ రాకేష్ ని నిర్మాత అనే బూచిగా చూపిస్తూ... వెనుక నుంచి పావులు కదిల్చడం మొదలుపెట్టేసింది వైఎస్సార్ పార్టీ. 


‘రాజకీయ ఉద్దేశం లేదు’ అని వర్మ ఓ పక్క చెబుతూనే... టీడీపీపై సెటైరికల్ ట్వీట్ లు పెట్టడం మొదలుపెట్టాడు. ‘ఈ దీపావళి కాదుగానీ... వచ్చే దీపావళి... టీడీపీలో చాలా లక్ష్మీ బాబులు పేలతాయ్’ అని ట్వీట్ చేసి సంచలనానికే తెరలేపాడు. అంతేకాదు.. జేడీ చక్రవర్తి వెళ్లి లక్ష్మీపార్వతి అపాయింట్మెంట్ అడగడం.. తెలుగుదేశం నాయకులపై వర్మ మాటల యుద్ధానికి దిగడం.. ఇదంతా ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. 

 


ఇదిలావుంటే... వైసీపీ ఈ సినిమా విషయంలో ఇంత దూకుడుగా ఉంటే... అధికార టీడీపీ ఊరుకుంటుందా? ఎన్టీయార్ జీవితంలోని ఆ చివరి ఘట్టాన్నే కథాంశంగా తీసుకొని మరో కథను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయ్. సినిమా పేరు ‘లక్ష్మీస్ వీరగ్రంధం’. తమిళనాడు టీడీపీ నాయకుడు, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి... నటి వాణివిశ్వనాథ్ తో కలిసి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ విషయాన్ని కేతిరెడ్డి మీడియాకు తెలిపాడు. 


‘ఇందులో ఎన్టీయార్ చివరి రోజులు విషాదానికి అసలు కారణాలు చెప్పబోతున్నాం. లక్ష్మీపార్వతి... తన భర్త వీరగంధం వెంకట సుబ్బారావును వదిలి ఎన్టీయార్ పంచన ఎలా చేరింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది ఇందులో ఉంటాయ్. ప్రధాన పాత్రను లక్ష్మీరాయ్ తో చేయించాలనుకుంటున్నాం. పార్వతీ మెల్టన్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. రెండు రోజుల్లో పాటల రికార్డింగ్ మొదలవుతుంది. ఇందులో ఓ హరికథ. మూడు పాటలు ఉంటాయ్. నవంబర్ రెండోవారంలో షూటింగ్ మొదలుపెడతాం. మిగిలిన పాత్రధారుల వివరాలు కూడా త్వరలో తెలుపుతాం’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని 2018 జనవరిలోనే విడుదల చేస్తామని ప్రకటించడం విశేషం. 


‘లక్ష్మీస్ ఎన్టీయార్’ వల్ల టెన్షన్ అంతా చంద్రబాబుకే అని మొన్నటిదాకా కొందరన్నారు. మరి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ వల్ల టెన్షన్ ఎవరికో చెప్పాల్సిన పనిలేదేమో! తాడి ఎక్కేవాడుంటే... వాడి తల తన్నేవాడు కూడా ఉంటాడు అనడానికి ఇదే కదా నిదర్శనం. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.