నెట్ ఫ్లిక్స్ దెబ్బకు సినీ పెద్దల తీర్మానం తూచ్!
on Jan 31, 2023
నేడు థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. మంచి క్వాలిటీతో అతి తక్కువ సమయంలోనే అవి ఓటిటిలో దర్శనమిస్తూ ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలను చూడడం మానేశారు. మరీ పెద్ద స్టార్లైతే తప్ప దియేటర్ల వంక చూడడం లేదు. దీంతో సినీ నిర్మాతలు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఓటీటీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ఎనిమిది వారాలలోపు ఓటీటీలో రిలీజ్ కాకూడదు. అలాగే ఏ ఓ టి టి కి ఆ చిత్రాన్ని అమ్మారనే విషయం, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది వెండితెరపై థియేటర్లో ప్రదర్శించకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఆయా చిత్రాల ఓ టి టి సంస్థకు తాము చందాదారులం కావడంతో ఇక దాన్ని థియేటర్లలో చూసే పని ఏముందని జనాలు లైటుగా తీసుకోకుండా ఈ నిర్ణయాలను వారు ఆమోదించారు. కానీ తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి అనే విషయాన్ని థియేటర్లలో ప్రదర్శించారు.
మరో పక్క నెట్ ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా మేము ఆ సినిమా కొన్నాం... మేము ఈ సినిమా కొన్నాం..... తెలుగులో ఈ చిత్రం తమిళంలో ఆ చిత్రం... ఈ చిత్రాలను మేమే వివిధ భాషల్లో రిలీజ్ చేస్తామంటూ పబ్లిసిటీ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు. మిగిలిన ఓటీటీ సంస్థల కంటే ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ జోరు ఎక్కువగా ఉంది. దాంతో అది సినీ ప్రేక్షకుల చెవిలో పడకుండా ఉండడం లేదు. దాంతో వారందరూ నెట్ ఫ్లిక్స్ సంస్థ కోసం చందాదారులుగా మారాలని నిర్ణయం తీసుకుంటున్నారు. కొత్త తెలుగు సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటూ ఉంటే దానికి చందా కట్టేస్తే సరిపోతుందని థియేటర్ లోకి వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం లేదని సినీ ప్రేక్షకులు ఒక నిర్ణయానికి వస్తున్నారు. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ చందా ధరలు ఎక్కువ అయినప్పటికీ సబ్స్క్రిప్షన్లు తీసుకోవడానికి గతంలో పెద్దగా ఆసక్తి చూపని ప్రేక్షకులు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ చందాదారులుగా మారుతున్నారు. మరి వీటిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సినీ పెద్దల ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుంది? అనేది వేచి చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
