ఫస్ట్ క్లాస్లో పాసైన దివ్యాంగురాలు.. పెద్ద మనసును చాటుకున్న బాలయ్య!
on Apr 28, 2025
అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్ళు కూడా చదువులో వెనకపడిపోవడం మనం చూస్తుంటాం. సకల సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకుంటారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంటారు. కానీ, మంచానికే పరిమితమైన ఓ దివ్యాంగురాలు, ఇతరుల సహాయం లేనిదే తన పని తాను చేసుకోలేని నిస్సహాయురాలు చదువులో తన ప్రతిభను చాటుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు లావణ్య లక్ష్మి ఫస్ట్ క్లాస్లో పాసైంది. దివ్యాంగురాలైనప్పటికీ చదువుకోవాలన్న ఆసక్తితో తన కష్టాలన్నింటినీ పక్కకు పెట్టింది. కృషి, పట్టుదలతో పదో తరగతి పరీక్షలు రాసి 345 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాసైంది. లక్ష్మీ ప్రతిభ అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం, అభినందనల వెల్లువ మొదలైంది.
ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బాలయ్య బయటికి కఠినంగా కనిపించినా ఆయన మనసు ఎంతో సున్నితమైనదని, ఎవరైనా కష్టాల్లో ఉంటే చలించిపోతారని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇప్పటికే బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి చికిత్స అందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అభిమానులకు అడిగి మరీ సాయం చేస్తుంటారు. ఇప్పుడు లక్ష్మీ చదువులో చూపించిన ప్రతిభకు బాలయ్య ముగ్ధుడైపోయారు. ఆమె గురించి తెలుసుకొని స్వయంగా ఆ చిన్నారికి ఫోన్ చేసి మరీ అభినందించారు.
‘చాలా సంతోషంగా ఉందమ్మా.. చాలా గర్వంగా ఉంది. 345 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నీకేమీ లోటు ఉండదు. భగవంతుడికి ఒక ఛాలెంజ్ విసిరి, ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉంది చెల్లెమ్మా’ అంటూ ఆప్యాయంగా పలకరించారు బాలయ్య. దీంతో లావణ్య ఆనందానికి అవధుల్లేవు. బాలయ్య ఫోన్ చేయడంపై లావణ్య లక్ష్మి మాట్లాడుతూ ‘నాకు ఫోన్ చేసి అభినందించిన బాలకృష్ణ సార్కి థ్యాంక్స్’ అని ఎమోషనల్ అయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ లక్ష్మీని అభినందించారు. మాజీ మంత్రి జవహర్ కూడా ఆమె ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తున్నారు. ‘జై బాలయ్య.. ఇదిరా మా బాలయ్య’ అంటూ తమ హీరో గురించి క్యాప్షన్స్ పెడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
