అక్టోబర్ 5.. అప్పుడు 'శివ'లో చైన్.. ఇప్పుడు 'ది ఘోస్ట్'లో కత్తి!
on Sep 26, 2022
ముప్పై మూడు సంవత్సరాల క్రితం 'శివ'గా చైన్ పట్టుకొని, ప్రత్యర్థులను చితగ్గొట్టిన నాగార్జునకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే తేదీన 'ది ఘోస్ట్'గా కత్తి పట్టుకొని దుష్టులను తెగనరకడానికి వస్తున్నారు నాగార్జున. యస్.. 1989 అక్టోబర్ 5న 'శివ' వస్తే, 2022 అక్టోబర్ 5న 'ది ఘోస్ట్' వస్తోంది! ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మించారు.
ఆదివారం రాత్రి కర్నూలులో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగ్ మాట్లాడుతూ, "33 ఏళ్ల క్రితం అక్టోబర్ 4న 'శివ' అనే ఫ్యామిలీ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పుడు చైన్ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు అదే అక్టోబర్ 5న కత్తి పట్టుకొని వస్తున్నా. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే. విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుందంటారు. మాకు కూడా ఈ పండగ విజయాన్నిస్తుందని నమ్ముతున్నా. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు యాక్షన్, డ్రామా అంటే ఇష్టం. ఆ రెంటినీ కలిపి ఆయన 'ది ఘోస్ట్' తీశారు. ఈ సినిమా కోసం నాకు, హీరోయిన్ సోనాల్ చౌహాన్కు ట్రైనింగ్ ఇప్పించి మరీ తీశారు." అని చెప్పారు.
ఈ ఏడాది మొదట్లో నాగచైతన్యతో కలిసి వచ్చిన 'బంగార్రాజు' మూవీ థియేటర్లలో హిట్టవడమే కాకుండా, ఓటీటీ, టీవీలో రికార్డులు సృష్టించిందన్నారు నాగ్. దానికి లభించిన ఆదరణ మరే మూవీకీ ఈ ఏడాది రాలేదన్నారు. త్వరలో అఖిల్తో కలిసి నటించబోతున్నానని వెల్లడించారు. "నాకెంతో ఆత్మీయులైన చిరంజీవి గారి సినిమా కూడా విజయదశమికి విడుదలవుతోంది. మా రెండు సినిమాలకీ విజయం దక్కాలని కోరుకుంటున్నా" అని ఆయన చెప్పారు.
Also Read