రాత్రి ఒంటి గంట నుంచే 'సరిలేరు నీకెవ్వరు' షోస్
on Jan 10, 2020
మహేశ్ మేనియాతో రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. ఆయన హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సంక్రాంతి సందర్భంగా శనివారం (జనవరి 11) విడుదలవుతున్న విషయం తెలిసిందే. జనవరి 5న జరిగిన ప్రి రెలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇండస్ట్రీలోనూ, ట్రేడ్లోనూ వచ్చిన ఊహించని స్థాయిలో పాజిటివ్ బజ్ రావడంతో దాని క్యాష్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డ్ స్థాయి కలెక్షన్ల కోసం తొలిరోజు నుంచి రెండు వారాల పాటు షోల సంఖ్యను పెంచుకోవడానికి అనుమతించాలంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అదనంగా మరో షో వేసుకోవడానికి అనుమతిచ్చింది. అంటే ఉదయం 11 గంటల ఆటకంటే ముందు 7 గంటలకు అదనంగా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఉదయం ఆటను ప్రదర్శించనున్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా రెండు వారాల పాటు ఈ సినిమాకు ఐదు ఆటలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా ఏడు షోలకు అనుమతివ్వడం గమనార్హం. 11వ తేదీ తెల్లవారు జాము 1 గంట నుంచే 'సరిలేరు నీకెవ్వరు' ఆటలతో థియేటర్లు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 12వ తేదీ నుంచి 'అల వైకుంఠపురములో' సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించాల్సి రావడంతో ఈ షోల పెంపుతో ఆ లోటును కొంతమేర పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆ సినిమాకు సైతం ఇదే రకంగా తెలుగు రాష్ట్రాల్లో షోలు పడనున్నాయి. ఈ షోల పెంపు వల్ల రెండు సినిమాల్లో దేనికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.