మెగాస్టార్ లైనప్.. సుకుమార్, రావిపూడి, త్రివిక్రమ్!
on Oct 4, 2023
మెగాస్టార్ చిరంజీవి తన లైనప్ తో ఈ జనరేషన్ స్టార్స్ కి కూడా చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మెగాస్టార్.. ఆ తర్వాత వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మూడు ప్రాజెక్ట్ ల కోసం సక్సెస్ ఫుల్ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి లను రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని బలంగా న్యూస్ వినిపిస్తోంది. డీవీవీ దానయ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారని వినికిడి. ప్రస్తుతం 'గుంటూరు కారం'తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నారు. అది పూర్తి అయ్యాక చిరు ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతారో లేక ముందే చిరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారో చూడాలి.
అలాగే సుకుమార్ డైరెక్షన్ లో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారట. ఈ కాంబినేషన్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సెట్ చేశారట. 'పుష్ప'తో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన సుకుమార్.. ప్రస్తుతం 'పుష్ప-2'ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన రూ.1000 కోట్ల సినిమా దర్శకుడిగా మారడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాంటిది ఆయన పుష్ప-2 తర్వాత మెగాస్టార్ తో చేతులు కలపనున్నారని అంటున్నారు.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఖరారైందని, దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. అనిల్ రావిపూడి త్వరలో 'భగవంత్ కేసరి'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ తర్వాత ఆయన ఫోకస్ మెగా ప్రాజెక్ట్ పైకి షిఫ్ట్ కానుందట.
ఏది ముందు, ఏది వెనుక ఉంటుందో కానీ ఈ మూడు ప్రాజెక్ట్స్ ఉండటం ఖాయమని అంటున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో మెగాస్టార్ మొదటిసారి పనిచేయనుండటం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
