మణిశర్మ హవాతో తమన్కు దెబ్బేనా?
on Mar 11, 2020
ఒకప్పుడు టాలీవుడ్ను తన సంగీతంతో శాసించిన మణిశర్మ.. యువ సంగీత దర్శకుల హవాలో వెనుక పడిపోయి, ఆరేడేళ్ల పాటు లైమ్లైట్లోనే లేకుండా పోయాడు. 2019లో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చి బ్లాక్బస్టర్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఆయనకు మళ్లీ ఊపిరినిచ్చింది. నిజం చెప్పాలంటే ఆ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యిందనుకోవాలి. అటు పాటలకు ఇచ్చిన బాణీలు, ఇటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో 'ఇస్మార్ట్ శంకర్'ను ఇంకో లెవల్కు తీసుకుపోయాడు. అప్పటిదాకా ఆయనను అంతగా లెక్కలోకి తీసుకోని డైరెక్టర్లు, హీరోలు ఆయనపై దృష్టిపెట్టక తప్పని స్థితి కల్పించాడు.
ఇప్పుడు ఏకంగా ఆయన చేతిలో ఆరు సినిమాలున్నాయి. అవన్నీ పేరు పొందిన హీరోల సినిమాలే కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న 'ఆచార్య' సినిమా ఆయన చేతుల్లో వాలింది. దాంతో పాటు వెంకటేశ్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తోన్న' నారప్ప', రామ్-కిశోర్ తిరుమల కాంబినేషన్లో తయారవుతోన్న 'రెడ్', విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న 'లైగర్', గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ ఫిల్మ్ 'సీటీమార్', శర్వానంద్ హీరోగా నూతన దర్శకుడు శ్రీకార్తీక్ రూపొందించే సినిమాలకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాలతో ఆయన మళ్లీ మునుపటి ఫామ్ను కనపరుస్తాడని ఆశించవచ్చు. ఒకవైపు మెలోడీలు, మరోవైపు ఫాస్ట్ బీట్ సాంగ్స్కు మణిశర్మ కట్టే బాణీలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయని మనకు తెలుసు. దానికి తోడు బీజీఎమ్ ఇవ్వాలంటే అది మణిశర్మే అన్నంతగా ఆయన ఒకప్పుడు పేరు పొందాడు. ఇప్పుడు ఆ రోజుల్ని జ్ఞాపకం చేసే దిశగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాఫ్ ఫామ్లో ఉన్న తమన్కు మణిశర్మ చెక్ చెప్పే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.