ENGLISH | TELUGU  

ముగ్గురికీ లక్కీ డేట్ మిస్సాయే!

on May 15, 2020

 

2020 వేసవి.. తెలుగు చిత్రసీమ పాలిట‌ ఓ పీడ కల. కరోనా కల్లోలంతో బాక్సాఫీస్.. సినిమాలు లేక బోసిపోయింది. ఫ‌లితంగా ఎన్నడూ లేని విధంగా ‘జీరో రిలీజ్ సమ్మర్’ నమోదయింది. అంతేకాదు ఎందరో ఆశలు ఆవిరయ్యాయి. మరీ ముఖ్యంగా.. అచ్చొచ్చిన తేదీల్లో సందడి చేయాలనుకున్న ముగ్గురు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి చుక్కెదురైంది. ఆ అగ్ర సంగీత దర్శకులు మరెవరో కాదు.. 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ, 'టాలీవుడ్ రాక్ స్టార్' దేవిశ్రీ ప్రసాద్, 'యువ సంగీత సంచలనం' త‌మన్.

‘జల్సా’ డేట్ మిస్ చేసుకున్న డీఎస్పీ:

‘జల్సా’.. స్వరతరంగం దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో వెరీ స్పెషల్ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఫస్ట్ టైమ్‌ ఈ సినిమా కోసమే జట్టుకట్టాడు డీఎస్పీ. అందుకే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు. చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించాడు. షరా మామూలుగానే మరో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2008 ఏప్రిల్ 2న విడుదలైన ‘జల్సా’ తేదీని టార్గెట్ చేసుకుని ఈ ఏడాది డీఎస్పీ నుంచి మరో చిత్రం రావాల్సింది. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో టార్గెట్ డేట్ మిస్ అయింది. ఆ సినిమా మరేదో కాదు.. ‘ఉప్పెన’. పవన్ కళ్యాణ్ మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతూ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ‘ఉప్పెన’.. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘జల్సా’ విడుద‌ల‌ తేదీ ఏప్రిల్ 2కే తెరపైకి వచ్చి ఉండేది. అప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ కావడం చూస్తే.. దేవిశ్రీకి మరో మ్యూజికల్ హిట్ ఖాయమనిపించింది. అయితే, అనూహ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో లక్కీ డేట్‌ని మిస్ చేసుకున్నట్ల‌యింది డీఎస్పీకి.

అచ్చొచ్చిన తేదీకి ‘రెడ్’ సిగ్నల్:

'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘బావగారూ బాగున్నారా’. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో మణి మొదటిసారిగా పనిచేసిన సినిమా ఇది. ఆల్బమ్‌లోని ఐదు పాటలు చార్ట్‌బస్టర్స్ కావడమే కాకుండా.. సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవడంతో మణి స్థాయి అమాంతం పెరిగిపోయింది. అనతికాలంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంలో ‘బావగారూ బాగున్నారా’ సినిమా కీలక పాత్ర పోషించిందన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తిలేదు. 1998 ఏప్రిల్ 9న ఈ సినిమా విడుద‌ల కాగా.. సుదీర్ఘ విరామం అనంతరం స‌రిగ్గా అదే ఏప్రిల్ 9ని టార్గెట్ చేస్తూ ఈ సంవత్సరం మణి నుంచి మరో సినిమా రావాల్సింది. ఆ చిత్రమే ‘రెడ్’. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత రామ్, మణి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘రెడ్’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడు తన లక్కీ డేట్‌కే రానుండడంతో మణి కూడా ‘రెడ్’పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే, కరోనా కార‌ణంగా ‘రెడ్’ రిలీజ్‌కి ‘రెడ్ సిగ్నల్’ పడింది. దాంతో ఏప్రిల్ 9 నుంచి సినిమా వాయిదా పడింది. సో.. మణికి లక్కీ డేట్ మిస్సవ్వ‌క తప్పలేదు.  

‘క్రాక్’కి ‘కిక్’ ట‌చ్ మిస్:

అనతికాలంలోనే శతాధిక చిత్రాల స్వరకర్త అనిపించుకున్నాడు 'యువ సంగీత సంచలనంస‌ త‌మన్. తెలుగునాట 'రేసుగుర్రం'లా దూసుకుపోతున్న ఈ స్టార్ కంపోజ‌ర్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్రం ‘కిక్’ (2009). మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ కాంబినేషన్‌లో త‌మన్ జట్టుకట్టిన ‘కిక్’.. అటు మ్యూజికల్‌గానూ, ఇటు కమర్షియల్‌గానూ సూపర్ సక్సెస్. కట్ చేస్తే.. 11 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ‘కిక్’ డేట్ (మే 8)కే రవితేజ, త‌మన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘క్రాక్’ రిలీజ్ కావాల్సింది. అయితే, కరోనా ప్రభావంతో త‌మన్ కూడా లక్కీ డేట్‌ని మిస్ చేసుకున్నట్ల‌యింది.

మొత్తానికి.. మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, త‌మన్.. ఇలా ఈ ముగ్గురు అగ్ర సంగీత ద‌ర్శ‌కులు కూడా కరోనా కారణంగా లక్కీ డేట్ టార్గెట్‌ని మిస్ చేసుకోవడం 'టాక్ ఆఫ్ ది టాలీవుడ్' అవుతోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.