కొలువుదీరిన 'మా' కొత్త కార్యవర్గం.. విష్ణుకి అండగా తెలంగాణ ప్రభుత్వం!
on Oct 16, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కొత్త కార్యవర్గం కొలువుదీరింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. అలాగే విష్ణు ప్యానెల్ లోని 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్, మోహన్ బాబు, నరేష్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ముందుగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కొత్త కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొత్త కార్యవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం అభినందనీయం అన్నారు. మా అధ్యక్షుడు విష్ణుకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టికెటింగ్ విషయంలో ఇబ్బంది జరుగుతుందని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ అంటే.. ఆన్లైన్ టికెటింగ్ అంకురార్పణ చేసింది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. అలాగే మోహన్ బాబుని అన్నయ్య అని సంబోధించిన తలసాని.. ఆయన విష్ణుకి క్రమశిక్షణ, సంస్కారం నేర్పారని కొనియాడారు. మోహన్ బాబు కి కోపం, ఆవేశం అంటారని.. కానీ వాటి వల్ల ఆయనకే నష్టం జరిగింది కానీ.. ఎవరికీ నష్టం జరగలేదని తలసాని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ నుంచి 15 మంది, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలు జరిగిన విధానాన్ని తప్పుబడుతూ.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు.
Also Read