స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానంటున్న మంచు హీరో
on Aug 7, 2022
'దొంగ దొంగది'(2004) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ 18 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా ఎందుకనో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మనోజ్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఏడాది క్రితం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాని అనౌన్స్ చేశాడు కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అసలు మనోజ్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అన్న అనుమానాలు కలిగాయి. అయితే తాజాగా మంచు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు మనోజ్. త్వరలోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానని అంటున్నారు.
మనోజ్ హీరోగా నటించిన మొదటి సినిమా 'దొంగ దొంగది' విడుదలై నిన్నటితో(ఆగస్టు 6) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక స్పెషల్ నోట్ ని విడుదల చేశాడు మనోజ్. తన 18 ఏళ్ళ అందమైన ప్రయాణంలో తోడున్న ఆడియన్స్ కి, దర్శక నిర్మాతలకు, తోటి నటీనటులు, టెక్నిషియన్స్ థాంక్స్ చెప్పాడు. కొన్ని కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని, ఈ సమయంలో ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని అన్నాడు. అలాగే త్వరలోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానని మనోజ్ చెప్పుకొచ్చాడు.