మహేశ్, రణ్వీర్.. బాలీవుడ్ మల్టీస్టారర్?
on Mar 1, 2020
ఇప్పుడు బాలీవుడ్లో జోరుగా ప్రచారమవుతున్న గాసిప్ ఇది. అక్కడి మీడియా సంస్థలు సైతం మహేశ్ బాలీవుడ్ సినిమాపై వార్తలు వెలువరిస్తున్నాయి. లేటెస్టుగా ముంబైలో మహేశ్, రణ్వీర్.. ఇద్దరూ జంటగా థమ్స్ అప్ యాడ్లో నటించారు. ఇప్పటివరకూ థమ్స్ అప్కు సౌత్ ఇండియా అంబాసడర్గా ఉన్న మహేశ్.. సోలోగానే ఆ యాడ్ చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఇండియా లెవల్లో మహేశ్కు పెరిగిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని కోక్ కంపెనీ రణ్వీర్కు మహేశ్ను జోడించి యాడ్ రూపకల్పన చేసింది. అంటే త్వరలోనే మహేశ్ నటించిన యాడ్ దేశవ్యాప్తంగా ప్రసారం కానున్నది.
మహేశ్ ముంబై వెళ్లిన సందర్భంలో అతడిని బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన సాజిద్ నదియడ్వాలా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది అనేక ఊహలకు తావిచ్చింది. మహేశ్ను ఒక మల్టీస్టారర్లో నటించమని అడగడానికే సాజిద్ ఆయనను కలిశాడంటూ బాలీవుడ్లో ప్రచారం మొదలైంది. ఇద్దరు హీరోలు ఉండే ఆ సినిమాలో ఇప్పటికే ఒక హీరోగా రణ్వీర్ సింగ్ ఖాయం కాగా, మరో హీరో కోసం మహేశ్ను సాజిద్ సంప్రదించాడనీ, భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆయన మొగ్గు చూపాడని కూడా అక్కడి వర్గాలు అంటున్నాయి. అయితే సాజిద్ ప్రపోజల్కు మహేశ్ ఒప్పుకున్నదీ, లేనిదీ మాత్రం వెల్లడి కాలేదు.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రాంచరణ్, ప్రభాస్.. బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. మిగతా అందరికంటే ఎక్కువగా 'బాహుబలి' సినిమాలతో ప్రభాస్ అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'లైగర్' సినిమాతో విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ బాలీవుడ్ ఎంట్రీపై ఆయన ఫ్యాన్స్ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఎప్పుడు మీడియా బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగినా, తనకు అక్కడకు వెళ్లే ఆసక్తి లేదని మహేశ్ చెప్తూ వస్తున్నాడు. ఏమో.. స్క్రిప్ట్, రెమ్యూనరేషన్.. రెండూ నచ్చితే మహేశ్ మనసు మార్చుకుంటాడేమో.. లెటజ్ వెయిట్ అండ్ సీ..
Also Read