'ఆచార్య' టైటిల్ అనౌన్స్ చేసి నాలుక కరుచుకున్న మెగాస్టార్!
on Mar 2, 2020
అనాలోచితంగా తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసి, ఆ వెంటనే నాలుక కరుచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భం 'ఓ పిట్ట కథ' ప్రి రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ ఒక కీలక పాత్ర చేస్తోన్న ఈ మూవీకి 'ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇప్పుడు దాన్ని చిరంజీవి నిజం చేశారు. భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న 'ఓ పిట్ట కథ' ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో జరిగింది. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాతో సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు ఒక హీరోగా పరిచయమవుతున్నాడు. మరో హీరోగా విశ్వంత్ నటిస్తుండగా, నిత్యా శెట్టి నాయికగా నటిస్తోంది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి తన ప్రసంగం మధ్యలో అనాలోచితంగా తన సినిమా టైటిల్ను 'ఆచార్య' అంటూ ప్రస్తావించారు. దాంతో ఆ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆనందంతో కేకలు పెట్టారు. అప్పుడు చిరంజీవి తాను చేసిన పొరపాటును గ్రహించి, అనుకోకుండా టైటిల్ ప్రకటించేశాననీ, డైరెక్టర్ కొరటాల శివ తనను క్షమించాలనీ అన్నారు.
"రామోజీ ఫిల్మ్ సిటీలో మార్నింగ్ 7 గంటలకు షూటింగ్ అంటే, నేను 4.30 గంటలకు లేచి, 5.30 గంటలకు బయలుదేరి, 6.30కి ఫిల్మ్ సిటీకి వెళ్లి, మేకప్ వేస్తుకొని 7 గంటలకు షాట్లో ఉండేవాడ్ని. ఎర్రటి ఎండను కూడా లెక్కచెయ్యకుండా అక్కడే కూర్చొనేవాడ్ని. నీతులు చెప్పడం కోసం నేనీ స్టేజ్ ఎక్కలేదు. నేను ఆచరించి చూపుతున్నది మీకు తెలియజేయాలన్నదే నా ప్రయత్నం. కొరటాల శివ సినిమా 'ఆచార్య'.. (ప్రేక్షకుల కేకలు, ఈలలు).. (నవ్వుతూ) ఎక్కడ మిస్సయ్యానో తెలీట్లేదు. కొరటాల శివ గారు దానికేదో చక్కని ప్రోగ్రాం పెట్టుకొని, అందంగా దీన్ని (టైటిల్ను) లాంచ్ చేద్దామనుకుంటే, ఈ రకంగా 'ఓ పిట్ట కథ' సందర్భంగా నా నోటి ద్వారా లాంచ్ అయిపోయింది. సారీ శివ గారూ.. ఏమనుకోవద్దు. మంచి మంచి వార్తలు ఆపుకోలేం. దాన్ని ఆపడం కూడా కరెక్ట్ కాదు. ఇది రైట్. ఓకే" అని చెప్పారు చిరంజీవి.