ఎప్పటిలా మహేశ్ లేకుండా లాంచ్ అయిన 'సర్కారు వారి పాట'
on Nov 21, 2020
సూపర్స్టార్ మహేశ్ సినిమా 'సర్కారు వారి పాట' ప్రొడక్షన్ పనులు శనివారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. తన సెంటిమెంట్ ప్రకారం ఎప్పటిలా మహేశ్ ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాలేదు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు మహేశ్ కుమార్తె సితార క్లాప్ నివ్వగా, మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ ముహూర్తపు సన్నివేశానికి హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని కాశీవిశ్వనాథ స్వామి ఆలయం వేదిక అయ్యింది.
'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి నిర్మాతలు నవీన్ యెర్నేని, రామ్ ఆచంట, గోపి ఆచంట, దర్శకుడు పరశురామ్, సినిమాటోగ్రాఫర్ మది, ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు.
కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' రెగ్యులర్ షూటింగ్ జనవరి ఫస్ట్ వీక్ నుంచి అమెరికాలో జరగనుంది. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రధారులు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కాగా, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.