Home

»

Latest News

తెలుగులో ల‌త పాడిన రెండు పాట‌లు ఇవే!

Feb 6, 2022 12:04PM

 

గాన‌కోకిల‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన లెజెండ‌రీ సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ మ‌ర‌ణంతో దేశంలోని సంగీత ప్రియులంతా విషాద సాగ‌రంలో మునిగిపోయారు. ల‌త‌నూ, ఆమె గొంతునూ ప్రేమించ‌ని, ఆరాధించిన వాళ్లెవ్వ‌రు! ఎన్నో వేల పాట‌ల‌ను త‌న కంఠంతో వినిపించి, మ‌న‌ల్నంద‌ర్నీ ప‌ర‌వ‌శింప‌జేస్తూ వ‌చ్చిన ల‌త రెండంటే రెండు తెలుగు సినిమాల్లో రెండు పాట‌లు పాడారంటే ఒకింత బాధ‌గానూ, వెలితిగానూ అనిపిస్తుంది.

సి.వి. రంగ‌నాథ‌దాస్ నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 1955 నాటి 'సంతానం' సినిమాలో సుస‌ర్ల ద‌క్షిణామూర్తి సంగీత సార‌థ్యంలో ల‌త త‌న తొలి తెలుగుపాట‌ను పాడారు. అనిశెట్టి సుబ్బారావు రాసిన‌ ఆ పాట‌.. "నిదుర‌పోరా త‌మ్ముడా". "నిదుర‌పో.. నిదుర‌పో.. నిదుర‌పో.." అంటూ త‌న చిన్నారి త‌మ్ముడిని ఒళ్లో కూర్చోపెట్టుకొని ఒక టీనేజ్ అమ్మాయి పాడుతున్న‌ట్లు ఆ పాట‌ను చిత్రీక‌రించారు. త‌న‌కే సాధ్య‌మైన క‌మ్మ‌టి స్వ‌ర‌మాధుర్యంతో ల‌త పాడిన ఆ జోల‌పాట సూప‌ర్‌హిట్ట‌యింది. 'సంతానం' చిత్రంలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి జంట‌గా న‌టించారు.

ఆ త‌ర్వాత తెలుగులో మ‌రో పాట ల‌త చేత పాడించ‌డానికి 33 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఆఖ‌రి పోరాటం' (1988)లో "తెల్ల‌చీర‌కు త‌క‌థిమి త‌ప‌న‌లు" పాట‌ను ఎస్పీ బాలుతో క‌లిసి ఆమె పాడారు. వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి రాసిన ఈ పాట‌ను శ్రీ‌దేవి, నాగార్జున‌పై చిత్రీక‌రించారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com