ఆ డైరెక్టర్ తో 'సిరివెన్నెల' ఫోన్ కాల్.. తప్పుగా అర్థం చేసుకోకండి!
on Dec 4, 2021
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ కూచిపూడి వెంకట్ తో ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణ ఒకటి.. ఆయన మరణం తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన ఓ వైపు తన ఆరోగ్యం బాగాలేదని చెబుతూనే, మరోవైపు చాలా ఉత్సాహంగా మాట్లాడారు. 2015లో తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది అని.. అప్పుడు ఎడమవైపు సర్జరీ చేసారని, ఇప్పుడు కుడివైపు వచ్చిందని అన్నారు. 'నీ సినిమా వాసుకి రాయాలి. కానీ ఈ రెండు నెలలు రాయలేను. నీ దగ్గర తీసుకున్న రెండు తిరిగివ్వను(నవ్వుతూ). మళ్ళీ డిసెంబర్ తరువాత జనజీవన స్రవంతిలోకి వచ్చాక రాస్తా' అంటూ సిరివెన్నెల అనారోగ్యంతో కూడా నవ్వుతూ మాట్లాడారు.
కూచిపూడి వెంకట్ తో ఫోన్ లో సిరివెన్నెల మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కూచిపూడి వెంకట్ దగ్గర సిరివెన్నెల డబ్బులు అప్పుగా తీసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై కూచిపూడి వెంకట్ స్పందించారు. ఈ తప్పుడు ప్రచారం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. "గురువు గారు సీతారామశాస్త్రి గారు నా వద్ద అప్పు తీసుకున్నారని కొందరు అనుకోవడం నాకు బాధ కలిగించింది. నేను దర్శకత్వం వహించిన 'మొదటి సినిమా'కు పాటలు రాసినందుకు ఆయన రెండు లక్షలు తీసుకున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆ సమయంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన జోక్ చేశారు. నిజానికి ఆయన నాకెంతో సాయం చేశారు. ఆయన కెరీర్ పీక్ లో ఉండి, ఒక్కో సాంగ్ కి రెండు లక్షలు ఛార్జ్ చేస్తున్న సమయంలో కూడా.. నా సినిమాలో ఆరుపాటలు రాసి కేవలం రెండు లక్షలు తీసుకున్నారు. నా మీద ప్రేమతో అంత తక్కువ తీసుకొని నాకు సాయం చేశారు. ఆయన నాతో మాట్లాడిన ఫోన్ కాల్ ని కొందరు తప్పుగా అర్థంచేసుకోవడం.. గురువుగారి కుటుంబానికి, సన్నిహితులకు, నాకు బాధ కలిగించింది" అంటూ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, కూచిపూడి వెంకట్.. నవదీప్ హీరోగా నటించిన 'మొదటి సినిమా', కృష్ణ భగవాన్ నటించిన 'జాన్ అప్పారావు' సినిమాలకు దర్శకత్వం వహించారు.
Also Read