మహేశ్ భావి సూపర్స్టార్ అయ్యేందుకు బాటలు వేసిన తండ్రి కృష్ణ!
on Nov 15, 2022
సినీ రంగంలో నట వారసత్వం అనేది కామన్. అయితే తండ్రి వారసత్వాన్ని అంతే ఘనంగా కొనసాగించగలిగేది అతి కొద్దిమందే. ఆ కొద్దిమందిలో ముందు వరుసలో ఉన్న నటుడు మహేశ్బాబు. సూపర్స్టార్ కృష్ణ వారసత్వాన్ని అంది పుచ్చుకొని తానూ అభిమానుల చేత సూపర్స్టార్ అనిపించుకున్నాడు మహేశ్. 1983లో తొలిసారిగా 'పోరాటం' సినిమాలో నాన్న కృష్ణతో కలిసి నటించాడు మహేశ్. అప్పుడు అతనికి ఎనిమిదేళ్లు. నటన అంటే ఏమిటో అతనికి తెలీదు.
తండ్రి డైరెక్ట్ చేసిన 'శంఖారావం' సినిమా చేస్తున్నప్పుడే నటన మీద నిజంగా ఆసక్తి కలిగింది మహేశ్కు. కృష్ణ పెద్దకుమారుడు రమేశ్బాబు హీరోగా నటించిన 'బజారు రౌడీ'లో మహేశ్ కూడా నటించాడు. అందులో అతను ఫైట్ సీన్ చేసేటప్పుడు లొకేషన్కు కృష్ణ వచ్చారు. "చాలా బాగా చేస్తున్నావ్" అని కొడుకుని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత తను డైరెక్ట్ చేసిన 'ముగ్గురు కొడుకులు' మూవీలో మహేశ్కు సాంగ్, ఫైట్ ఉండేలా అతని క్యారెక్టర్ను డిజైన్ చేశారు కృష్ణ. ఇద్దరు కొడుకులను తనకు తమ్ముళ్లుగా చూపిస్తూ తీసిన ఆ సినిమా కృష్ణకు మంచి విజయాన్ని అందించింది. విజయన్ మాస్టర్ కొరియోగ్రఫీలో మహేశ్పై చేసిన ఫైట్ సీన్లో అతనికి డూప్ పెడతానని కృష్ణ చెప్పారు. దాంతో ఆయన లంచ్కి వెళ్లైన టైంలో విజయన్ మాస్టర్ను బతిమలాడుకొని తండ్రికి తెలీకుండా, డూప్ లేకుండా రియల్ షాట్స్ చేశాడు మహేశ్. తర్వాత కృష్ణకు ఈ విషయం తెలిసి "అలా రిస్క్ తీసుకోవద్దు" అని చెప్పారు. ఆ సినిమాలోనే మహేశ్పై అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం తీశారు కృష్ణ. మహేశ్ డైలాగ్స్ చెప్తుంటే సెట్లో ఉన్నవాళ్లంతా క్లాప్స్. ఆ సినిమాలో కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని కూడా కనిపించింది.
'గూఢచారి 117'లోనూ కృష్ణ, మహేశ్ కలిసి నటించారు. ఆ సినిమాలో "తెల్లదొరలు ఇక్కడికొచ్చి.." అనే పాట ఉంది. ఆ పాటను ఊటీలో తీస్తున్నప్పుడు కృష్ణ ఫ్యాన్స్ చాలామంది వచ్చి, మహేశ్ డ్యాన్స్ చూసి సూపర్ అన్నప్పుడు తండ్రిగా కృష్ణ చాలా ఆనందపడ్డారు.
మహేశ్ హీరో అయ్యాక ఇంతదాకా డ్యూయల్ రోల్ చెయ్యలేదు. కానీ బాలనటుడిగా ఉన్నప్పుడే కొడుకుతో డబుల్ రోల్ చేయించారు కృష్ణ. ఆ సినిమా.. 'కొడుకు దిద్దిన కాపురం'. కృష్ణ, విజయశాంతి భార్యాభర్తలు నటిస్తే, వారి కవల పుత్రులుగా మహేశ్ రెండు పాత్రలు చేశాడు. మహేశ్ను టైటిల్ రోల్లో చూపిస్తూ 'బాలచంద్రుడు' మూవీని డైరెక్ట్ చేశారు కృష్ణ. బాలనటునిగా మహేశ్కు అదే చివరి సినిమా. దాని తర్వాత గ్యాప్ తీసుకొని రాఘవేంద్రరావు డైరెక్షన్లో 'రాజకుమారుడు' మూవీతో హీరోగా లాంచ్ అవడానికి మహేశ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కృష్ణ. అశ్వినీదత్ నిర్మించిన ఆ సినిమా మంచి విజయమే సాధించడంతో కృష్ణకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా చూసి మహేశ్ మాస్ హీరోగా ఎదుగుతాడని చెప్పారు కృష్ణ. 'ఒక్కడు' చూసి "నీ కెరీర్కి తిరుగులేదు, చాలా స్ట్రాంగ్ స్టార్డం వస్తుంది" అని చెప్పారు. 'పోకిరి' చూసి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని ఆయన చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.
ఇలా హిట్టయిన సినిమాలే కాదు, మహేశ్ నటించగా ఫ్లాపైన, డిజాస్టర్ అయిన సినిమాలు చూసి వాటి బాక్సాఫీస్ భవిష్యత్తును ముందే చెప్పేశారు కృష్ణ. తన సినిమా వచ్చిందంటే నాన్న దాని గురించి ఏం చెబుతాడా అని ఎదురుచూసేవాడు మహేశ్. అలా దాదాపు ఆయన ఏదైతే అంచనా వేసేవారే అలాగే జరుగుతూ వచ్చిందని ఓ సందర్భంగా మహేశ్ చెప్పాడు.
Also Read