దాసరితో వీళ్ళని పోల్చలేం.. చాలా తేడా ఉంది!
on Dec 3, 2021
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. విషయం ఏదైనా, వ్యక్తి ఎవరైనా తన మనసుకి అనిపించింది కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం కోటకు అలవాటు. దర్శకరత్న దాసరి నారాయణరావు తరువాత టాలీవుడ్ కి పెద్ద దిక్కు లేకుండా పోయిందనే భావన ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. తాజాగా ఇదే విషయమై స్పందించిన కోట.. టాలీవుడ్ లో దాసరి ప్లేస్ ని భర్తీ చేసే వ్యక్తి లేడని తేల్చి చెప్పారు.
తాజాగా తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓటీటీ గురించి తనకు అంతగా అవగాహన లేదని, ఇంతవరకు ఓటీటీలో నటించలేదని చెప్పారు. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా అవకాశాలలో మొదటి ప్రాధాన్యత తెలుగువారికి ఇవ్వాలని కోట అన్నారు. మా ఎన్నికల సమయంలో తాను ప్రకాష్ రాజ్ గురించి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని చెప్పారు. వృత్తి మీద గౌరవం లేని అలాంటి వ్యక్తి 'మా' ప్రెసిడెంట్ అవ్వడం తనకు ఇష్టంలేదని అన్నారు. గతంలో నాగబాబు సైతం ప్రకాష్ రాజ్ తీరును తప్పుబట్టారని కోట గుర్తు చేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో దాసరికి సంబంధించిన ప్రశ్న కోటకు ఎదురైంది. దాసరి మరణం తర్వాత సినీ పెద్దగా ఎవరుంటే బాగుంటుంది? అని అడిగిన యాంకర్.. మురళీమోహన్, చిరంజీవి, మోహన్ బాబు పేర్లను ప్రస్తావించారు. "ఎవరు పెద్ద అంటే ఏం చెప్తాం. ఆ సమయంలో అంటే ఆయనకు అలా సాగింది. పదిమందికి సాయం చేయాలనుకునే వ్యక్తిత్వం ఆయనది. ఏవైనా సమస్యలు వచ్చినా ఆయన పట్టించుకుంటారు. ఆయనకీ వీళ్ళందరికీ తేడా ఉంది" అంటూ కోట బదులిచ్చారు.
Also Read