కరోనాపై మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన జూనియర్ ఎన్టీఆర్!
on Mar 17, 2020
"చేతులను మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్లొచ్చినప్పడో, భోజనానికి కూర్చున్నప్పుడో కనీసం రోజుకు ఏడెనిమిది సార్లు కడుక్కోండి. మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్లు వేసుకోవాలి. అనవసరంగా వేసుకుంటే కోవిడ్ 19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి. వాట్సాప్లో వచ్చే ప్రతీ వార్తనీ దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమెంతో తెలియకుండా ఫార్వార్డ్ చేయకండి. అనవసరంగా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. డబ్ల్యుహెచ్వో సైట్లో సూచనలు ఇస్తుంటారు. వాటిని ఫాలో అవుదాం. స్టే హైజెనిక్".. అంటూ కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.
అతనితో పాటు రామ్చరణ్ కూడా మరికొన్ని జాగ్రత్తలు చెప్పాడు. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఈ వీడియో రిలీజ్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ.. తన మాటల్లో ఒకచోట తారక్ తప్పులో కాలేయడం గమనార్హం. "మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్లు వేసుకోవాలి".. అని చెప్పిన తారక్, ఆ తర్వాత "అనవసరంగా మాస్క్లు వేసుకుంటే కోవిడ్ 19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది".. అని చెప్పడం చర్చనీయాంశమైంది. ఎక్కడైనా కోవిడ్ 19 వైరస్ సోకకుండా మాస్కులు వేసుకోమని చెప్తారు కానీ, అవి వేసుకుంటే కోవిడ్ 19 వైరస్ అంటుకుంటుందని చెప్పడమేంటని ఆ వీడియో చూసినవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలోనూ తారక్ సూచనలపై సెటైర్లు పేలుతున్నాయి. మంచి మాటకారిగా తారక్కు పేరుంది. ఏ విషయంపైనైనా తడుముకోకుండా, అనర్గళంగా మాట్లాడుతూ ఆకట్టుకొనే అతను ఎప్పుడూ ఇలా తప్పులు చెప్పి దొరికిపోలేదు. కానీ ఇప్పుడు ఒక రికార్డెడ్ వీడియోలో తప్పు చెప్పి దొరికిపోయాడంటూ అతని అభిమానులే ఫీలవుతుంటే, యాంటీ ఫ్యాన్స్ సంగతి చెప్పేదేముంది! వీడియో రికార్డ్ చేశాకైనా ఒకసారి చూసుకొని ఉంటే, ఈ తప్పు దొర్లేది కాదు.