సినిమా సినిమాకి దిగిపోతున్న గోపీచంద్.. డైలమాలో హీరో కెరీర్!
on Jul 4, 2022
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో గోపీచంద్ ఒకడు. విలన్ గా, హీరోగా ఇలా ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేయగలిగే గోపీచంద్ తన కెరీర్ లో పలు విజయాలను అందుకున్నాడు. అయితే కొంతకాలంగా వరుస పరాజయాలను పొందుతూ సరైన విజయం కోసం ఎదురుచూసున్నాడు. తన తర్వాత వచ్చిన యాక్టర్స్ సినిమా సినిమాకి తమ మార్కెట్ పెంచుకుంటూ పోతుంటే.. గోపీచంద్ మాత్రం చాలా వెనకపడిపోతున్నాడు. నిజం చెప్పాలంటే సినిమా సినిమాకి దిగిపోతున్నాడు. టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో చేస్తున్న తప్పులే గోపీచంద్ కి ఈ పరిస్థితి రావడానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'తొలివలపు'(2001) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన గోపీచంద్ మొదటి చిత్రంతో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత విలన్ గా నటించిన 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాలతో మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో హీరోగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 'యజ్ఞం'(2004), 'ఆంధ్రుడు'(2005), 'రణం'(2006) ఇలా వరుస యాక్షన్ సినిమాలతో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అదే జోష్ లో 'లక్ష్యం'(2007), 'శౌర్యం'(2008) వంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా హీరోగా కెరీర్ స్టార్టింగ్ లో ఏడాదికో హిట్ అందుకున్న గోపీచంద్ 2009 నుంచి తడబడ్డాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ 13 ఏళ్లలో 15 సినిమాల్లో హీరోగా నటించగా 2014 లో వచ్చిన 'లౌక్యం' మాత్రమే సాలిడ్ విజయాన్ని అందుకుంది. కొన్ని సినిమాలు పర్లేదు అనిపించుకున్నా కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. మెజారిటీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా విడుదలైన 'పక్కా కమర్షియల్' కూడా గోపీచంద్ ని ప్లాప్స్ నుంచి బయటపడేయకపోయింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి నెగటివ్ టాక్ రావడమే కాకుండా.. గోపీచంద్ గత చిత్రాలతో పోల్చితే తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో వలర్డ్ వైడ్ గా రూ.10 కోట్ల షేర్ రాబడితే గొప్ప అనేది ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
గోపీచంద్ లో టాలెంట్ కి కొదవలేదు. కథలు, దర్శకుల ఎంపికలో చేస్తున్న తప్పుల కారణంగానే గోపీచంద్ వెనక పడుతున్నాడు. గోపీచంద్ కి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు పడకపోవడం కూడా కాస్త మైనస్ అయింది. రాజమౌళి, వీవీ వినాయక్ లాంటి దర్శకులతో అప్పట్లో గోపీచంద్ కి ఒక్క యాక్షన్ ఫిల్మ్ పడుంటే హీరోగా తన రేంజ్ మరో స్థాయికి వెళ్ళుండేది. పూరి జగన్నాథ్ 'గోలీమార్' చేసినప్పటికీ అది గోపీచంద్ కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. ప్రస్తుతం వీవీ వినాయక్ జోరు తగ్గింది. రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు కాబట్టి గోపీచంద్ తో సినిమా చేసే అవకాశం లేదు. ఇటీవల మళ్ళీ విలన్ గా నటించడానికి సిద్ధమని గోపీచంద్ ప్రకటించాడు. విలన్ గా ఏమైనా రాజమౌళి సినిమాలో అవకాశమొస్తుందేమో చూడాలి. అయితే ఇప్పుడు గోపీచంద్ హీరోగా నిలబడాలంటే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ పడితే బాగుంటుంది. ఎందుకంటే గోపీచంద్ ప్రయోగాలు చేసిన దానికంటే యాక్షన్ సినిమాలకే ఎక్కువ ఆదరణ లభించింది. అలా అని 'పక్కా కమర్షియల్' లాంటి పసలేని కథాకథనాలతో సినిమా చేస్తే ప్రేక్షకుల తిరస్కరణ తప్పదు. ఇప్పటికైనా గోపీచంద్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే తావరలో అప్పట్లో గోపీచంద్ అనే హీరో ఉండేవాడు అని చెప్పుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
కాగా ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే ప్రస్తుతం శ్రీవాస్ కూడా ఫ్లాప్స్ లో ఉన్నాడు. మరి ఈ సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందో.. లేక ఇద్దరి ఖాతాలో ఫ్లాప్ గా మిగిలిపోతుందో చూడాలి.