నిన్న వంగవీటి... నేడు జార్జిరెడ్డి
on Aug 1, 2019
జార్జిరెడ్డి.. దశాబ్దాల క్రితం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్లోనే హత్య చేశారు. నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్. ఎందరో విద్యార్థులను కదిలించిన వ్యక్తి. అలాంటి విద్యార్థి నాయకుడి జీవితం వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. గతంలో ‘దళం’ అనే చిత్రాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు పొందిన జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 1960, 70లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'వంగవీటి' ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందం, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహతి కీలక పాత్రధారులు. ప్రముఖ నటుడు సత్య దేవ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక జార్జి రెడ్డి తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం.
లేటెస్ట్గా ఈ మూవీ ఫస్ట్ లుక్ను నిర్మాతలు విడుదల చేశారు. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని పోస్టర్లో చెబ్తున్నారు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికీ జార్జ్ జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
సాంకేతికవర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా 'సైరాట్'కు సినిమాటోగ్రఫీ అందించి, ఇటీవల మరాఠి బ్లాక్ బస్టర్ ‘నాల్’కు దర్శకత్వం వహించిన వహించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు డీఓపీగా పనిచేశారు. దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి అసోసియేటెడ్ ప్రొడ్యూసర్లుగా ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.