ఆగస్ట్ 13న 'స్వాతిముత్యం'గా రానున్న గణేశ్ బెల్లంకొండ
on Jun 14, 2022

గణేశ్ బెల్లంకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయాలని నిర్ణయించినట్లు నాగవంశీ తెలిపారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం' ను దర్శకుడు తీర్చిదిద్దారు అని చెప్పారు.
దర్శకుడి మాటల్లో చెప్పాలంటే 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రంలోని ప్రధానాంశం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా వినోదాన్ని పుష్కలంగా పంచుతుందనీ, సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తుందనీ ఆయన చెప్పాడు.
నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: సూర్య, ఎడిటింగ్: నవీన్ నూలి, కళ: అవినాశ్ కొల్లా, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, రచన-దర్శకత్వం: లక్ష్మణ్ కె. కృష్ణ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



