హీరోలే కాదు.. డైరెక్టర్లు కూడా అదే దారిలో ఉన్నారు.. ప్రూవ్ చేసిన ఫ్లాప్ డైరెక్టర్!
on Oct 8, 2025
సినిమాల నిర్మాణ వ్యయం భారీ పెరిగిపోయిందని, అందుకే కొత్త సినిమాల నిర్మాణం జోలికి వెళ్లడం లేదని కొందరు ప్రముఖ నిర్మాతలు బహిరంగంగానే చెప్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పారితోషికాలు అసాధారణ స్థాయిలో పెరిగిపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే గత పదేళ్లలో హీరోలు, హీరోయిన్లు, ప్రధాన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు విపరీతంగా పెరిగాయి. దాంతో సినిమా పూర్తయ్యే నాటికి నిర్మాతకు తడిసి మోపెడవుతోంది. అందుకే ఒకప్పుడు బ్లాక్బస్టర్స్ నిర్మించిన నిర్మాతలు కూడా సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈమధ్యకాలంలో రెమ్యునరేషన్ల విషయంలో చాలా సార్లు మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరిగాయి. ప్రధానంగా హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలన్న డిమాండ్ వినిపించింది. అయితే టాలీవుడ్లోని టాప్ హీరోలు మాత్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడం లేదు.
పైరసీతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న ఐ బొమ్మ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో కూడా సినిమాల బడ్జెట్, పారితోషికాల ప్రస్తావన కనిపించింది. బడ్జెట్ పెరిగిపోయిందనే కారణంతో టికెట్ రేట్లను అనూహ్యంగా పెంచేస్తున్నారని, దానివల్ల సామాన్య ప్రేక్షకులకు సినిమా అనేది అందుబాటులోకి రావడం లేదని ఆరోపించారు. అందుకే వారికి తక్కువ ధరలో సినిమా చూపించడానికే తాము పైరసీ చేస్తున్నట్టు పేర్కొంది. దీన్ని బట్టి రెమ్యునరేషన్లు అన్ని విషయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కొత్త విషయం ద్వారా హీరోలే కాదు, దర్శకులు కూడా పారితోషికం డిమాండ్ చేయడంలో ఏమాత్రం తక్కువ కాదు అని ప్రూవ్ అయింది. దానికి ఉదాహరణగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను చెప్పుకోవచ్చు. కొత్తబంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్హిట్ సినిమాలు చేశారు. ఆ తర్వాత వరుణ్తేజ్ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ చేసిన ముకుంద ఎబౌ ఏవరేజ్ అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత చేసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో మరో సినిమా చెయ్యలేదు. ఐదేళ్ళ తర్వాత తమిళ సూపర్హిట్ సినిమా అసురన్ను వెంకటేష్తో నారప్ప పేరుతో రీమేక్ చేసి ఫర్వాలేదు అనిపించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ళకు పెదకాపు1 పేరుతో మరో సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో దానికి సీక్వెల్ చెయ్యాలన్న ఆలోచన విరమించుకున్నారు.
గత రెండేళ్లుగా శ్రీకాంత్కు మరో సినిమా లేదు. ఈ గ్యాప్లో కూచిపూడి వారి వీధి పేరుతో ఓ కథను సిద్ధం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని చెయ్యాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ మొగలినేని ధీరజ్ దగ్గరకి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి ఫైనల్గా 25 కోట్లు బడ్జెట్ అనే అంచనాకు వచ్చారు. విశేషం ఏమిటంటే తన రెమ్యునరేషన్ను 5 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నారు శ్రీకాంత్. దాదాపు పదేళ్ళుగా సరైన హిట్ లేని డైరెక్టర్కి అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాత ధీరజ్ ఇష్టపడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. దీంతో మరో డైరెక్టర్తో, మరో కొత్త కథతో కిరణ్ అబ్బవరంతోనే సినిమా ప్లాన్ చేస్తున్నారు ధీరజ్. చాలా కాలంగా హిట్ అనేది లేని డైరెక్టరే అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే రన్నింగ్లో ఉన్న డైరెక్టర్ ఎంత డిమాండ్ చేస్తాడనేది ఆలోచించాల్సిన విషయం. రెమ్యునరేషన్ల వల్ల సినిమా నిర్మాణం భారంగా మారిందని, అందుకే ఎంతో అనుభవం ఉన్న నిర్మాతలు కూడా సినిమాలు చేసేందుకు వెనుకాడుతున్నారనే వాదనకు శ్రీకాంత్ అడ్డాల వ్యవహారం బలం చేకూరుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



