'రణరంగం'ను ఓడించిన 'ఎవరు'!
on Aug 17, 2019
ఓవర్సీస్ మార్కెట్లో శర్వానంద్ సినిమా 'రణరంగం'ను, అడివి శేష్ సినిమా 'ఎవరు' ఓడించింది. ప్రధానంగా యు.ఎస్.లో 'రణరంగం' కలెక్షన్లు డిజాస్ట్రస్గా ఉంటే, 'ఎవరు' వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. నిజానికి శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. బుధవారం 'ఎవరు' ప్రీమియర్ షోస్కు 61,499 డాలర్లు వసూలవడం యు.ఎస్.లో అతని మార్కెట్ వాల్యూ పెరుగుతోందని చెప్పడానికి గట్టి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా బాగుందనే టాక్తో గురువారం వసూళ్లు కూడా బాగున్నాయంటున్నారు. గురువారం ఆ సినిమా 43,320 డాలర్లను వసూలు చేసింది.
ఇక సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన 'రణరంగం' సినిమాకు బుధవారం ప్రీమియర్ షోస్ వెయ్యకపోవడం అక్కడి వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెబుతున్నారు. గురువారం తొలిరోజు ఆ సినిమా కేవలం 24,014 డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ప్రీమియర్ షోస్ను పక్కనపెట్టినా, తొలిరోజు వసూళ్లలో 'ఎవరు'తో పోలిస్తే 'రణరంగం' ఎంత వెనుకబడి ఉందో స్పష్టమవుతోంది. రివ్యూస్, బ్యాడ్ మౌత్ టాక్ 'రణరంగం' వసూళ్లను బాగా దెబ్బ తీశాయి. దీంతో యు.ఎస్.లో ఆ సినిమా డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.