ప్రభాస్తో సినిమా.. తీవ్ర ఒత్తిడిలో మారుతి!
on Jul 6, 2022
గోపీచంద్ హీరోగా తను రూపొందించిన 'పక్కా కమర్షియల్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ దిశగా వెళ్తుండటంతో డైరెక్టర్ మారుతి ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. తన కెరీర్లో ఫ్లాపుల కంటే ఎక్కువగా హిట్లు ఇచ్చిన దర్శకుడైనప్పటికీ, రెండు వరుస ఫ్లాపులు రావడంతో అతని బ్రాండ్ వాల్యూకు నష్టం చేకూరింది. 'పక్కా కమర్షియల్' కంటే ముందు అతను ప్రయోగాత్మకంగా తీసిన చిన్న సినిమా 'మంచి రోజులొచ్చాయి' కూడా ఫ్లాపయింది. ఆ మూవీలో సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటించారు.
కాగా ఇప్పటికే మారుతి డైరెక్షన్లో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, 'పక్కా కమర్షియల్' ప్రి రిలీజ్ ఈవెంట్లో మారుతి డైరెక్షన్లో నటిస్తానని చిరంజీవి అనౌన్స్ చేయడంతో.. ఆ స్టార్ల ఫ్యాన్స్ మారుతిని టార్గెట్ చేసుకొని, సోషల్ మీడియాలో నెగటివ్గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో అతను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.
ప్రభాస్, మారుతి కాంబినేషన్ మూవీని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన బూస్ట్తో దానయ్య ఈ మూవీకి పెద్ద బడ్జెట్ కేటాయించారు. అయితే పక్కా కమర్షియల్ రిలీజయ్యాక మారుతితో సినిమా వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోకు ట్విట్టర్ వేదికగా సందేశాలు ఇస్తున్నారు. వారితో మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా జత కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం మారుతి ఎలాంటి సబ్జెక్ట్ తయారు చేశాడనేదానిపై అందరి దృష్టీ మళ్లింది.