'గుడ్లక్ సఖి'కి దిల్ రాజు సపోర్ట్
on May 16, 2020
ఫిల్మ్నగర్లో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే కీర్తి సురేశ్ హీరోయిన్గా నగేశ్ కుకునూర్ రూపొందిస్తోన్న 'గుడ్లక్ సఖి' మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు నిర్మాత దిల్ రాజు పొందారు. ఆ సినిమా నిర్మాతలు మొదట అంచనా వేసుకున్న బడ్జెట్లో ముప్పాతిక వంతు పైగా ఖర్చు పెట్టారు. ఇప్పటివరకూ సినిమా సగమే పూర్తయింది. లాక్డౌన్ ఎత్తివేశాక షూటింగ్ కొనసాగించడానికి మరింత డబ్బు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రచారంలో ఉన్న దాని ప్రకారం 'గుడ్లక్ సఖి' సినిమాకు సంబంధించి మిగిలిన షూటింగ్ను లాక్డౌన్ తర్వాత జరిగేలా చూస్తాననీ, నిధుల కొరత రాకుండా తాను చూసుకుంటాననీ నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి మంచి పాత్రలకు, స్క్రిప్టులకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తోంది కీర్తి. 'గుడ్లక్ సఖి'తో పాటు మిస్ ఇండియా, రంగ్ దే, పెంగ్విన్, అన్నాత్తే సినిమాలను ఆమె చేస్తోంది. వీటిలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన 'పెంగ్విన్' మూవీ నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది.
'అన్నాత్తే' మూవీ 2021 పొంగల్కు రిలీజ్ అవుతుందని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇదివరకు కీర్తి తెలిపింది. ఈ మూవీలో రజనీకాంత్ కూతురిగా కీర్తి కనిపించనుండటం ఆసక్తికరం. నితిన్ సరసన ఆమె నటిస్తోన్న 'రంగ్ దే' మూవీకి సంబంధించి ఇప్పటివరకూ 70 శాతం షూటింగ్ పూర్తయింది.