‘సార్’ కు పాన్ ఇండియా క్రేజ్ ఉందా!?
on Feb 8, 2023
ఎంత అనుకున్నా కోలీవుడ్ స్టార్ ధనుష్ కు తెలుగులో ఉన్న మార్కెట్ చాలా తక్కువ. దానికి తోడు ఆయన ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలి తెలుగు సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి తీసిన మిస్టర్ మజ్ను, రంగుదే చిత్రాలు ఏ మాత్రం ఆడలేదు. ఇలాంటి సమయంలో వెంకి అట్లూరితో ధనుష్ తన తొలి తెలుగు చిత్రం చేయడం సమంజసమేనా? అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో ధనుష్య ఏమైనా తొందర పడ్డారా? అనే యాంగిల్ లో కూడా చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి తెలుగులో సార్ అనే టైటిల్ పెట్టారు. తమిళంలో ఈ సినిమా వాతి పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రంలో ధనుష్ జూనియర్ కాలేజీ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. దానికి వారం రోజుల ముందు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి ఎందుకనో సితార సంస్థ సార్ సినిమాకు హైప్ ని క్రియేట్ చేయలేకపోతోంది. ఈ సినిమాకి తెలుగులో కనీసపు హైప్ కనిపించడం లేదు. అయితే అనవసర హంగామా లేకుండా ఎలాంటి హైప్ లేకుండానే కంటెంట్ తో హిట్టు కొట్టాలన్న ఆలోచన దర్శక నిర్మాతలకు ఉందా? అనే అనుమానం వస్తుంది. ప్రచారానికి ఇంకా పదిరోజుల సమయం కూడా లేదు. ఇంకా సార్ మౌనం వీడలేదు. ఎందుకనో ప్రచారం బరిలోకి దిగలేదు అంటూ ఓ సెక్షన్ ప్రశ్నిస్తోంది. మరి సార్ దీనికి సమాధానం ఇస్తారో లేదో వేచి చూడాలి.