'ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారు'.. ఇది ధనుష్ తండ్రి నమ్మకం!
on Jan 20, 2022
కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్, ఆయన భార్య ఐశర్యా రజనీకాంత్ తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా జనవరి 17న ప్రకటించారు. 18 సంవత్సరాల తమ అనుబంధానికి ఫుల్స్టాప్ పెట్టేసి, విడాకులు తీసుకొని ఎవరి దారిలో వారు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే అప్పటిదాకా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడిపారు. వారి విడాకుల వార్త సహజంగానే ఫ్యాన్స్ను కలవరపెట్టింది. కాగా, ధనుష్, ఐశ్వర్య విడిపోవడాన్ని కుటుంబ కలహంగా ధనుష్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ కస్తూరిరాజా పేర్కొన్నారు. వారు విడిపోవడం అనేది తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తన కొడుకు, కోడలు విడిపోవడానికి వారి మధ్య ఏర్పడిన విభేదాలే కారణమని కస్తూరి రాజా వెల్లడించినట్లు డైలీతంతి తెలిపింది. పెళ్లయిన జంట మధ్య సాధారణంగా వచ్చే కుటుంబ కలహంగా వారు విడిపోవడాన్ని ఆయన అభివర్ణించారు. "ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య చెన్నైలో లేరు. ఆ ఇద్దరూ హైదరాబాద్లో ఉన్నారు. ఫోన్లో ఆ ఇద్దరితో మాట్లాడి, కొన్ని సలహాలు ఇచ్చాను." అని కస్తూరి రాజా చెప్పినట్లు సమాచారం.
Also read: ఇన్స్టాలో భర్తను అన్ఫాలో అయిన శ్రీజ.. ఆ ఇద్దరూ విడిపోతున్నట్లే!
సోషల్ మీడియాలో షేర్ చేసిన నోట్లో అందరూ తమ ప్రైవసీని గౌరవించాలని ధనుష్, ఐశ్వర్య అభ్యర్థించారు. వారు స్నేహితులుగా, దంపతులుగా, పేరెంట్స్గా, శ్రేయోభిలాషులుగా పద్దెనిమిదేళ్లు కలిసిమెలిసి ఉన్నారు. ఐశ్వర్య, తాను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నామనీ, మంచి కోసమే వ్యక్తులుగా తమని తాము అర్థం చేసుకోవడానికి సమయం వెచ్చించామనీ తన నోట్లో ధనుష్ తెలిపాడు.
Also read: ధనుష్, ఐశ్వర్యను కలిపేందుకు రజనీ విఫలయత్నం!
కస్తూరి రాజా చెప్పినట్లు ధనుష్, ఐశ్వర్య తిరిగి కలుసుకోవడానికి ముందుకు వస్తారని ఆశిద్దాం. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులున్నారు.