దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్
on Mar 12, 2020
'కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు' అని ఒక సామెత! కాయలు, పళ్ళు కాయని చెట్లను ఎవరూ పట్టించుకోరనే నిగూఢ అర్థం కూడా అందులో ఉంది. అలాగే, టాలెంట్ లేని టెక్నీషియన్ల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. టాలెంట్ ఉన్నోడిపై మాత్రం అంచనాలు ఎక్కువ పెట్టుకుంటారు. అంచనాలను టెక్నీషియన్ అనుకోకపోతే, అతడిపై విమర్శలు వస్తాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విషయంలో అదే జరిగింది. సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి, సంక్రాంతి బరిలో పోటీ గా నిలిచిన మరో సినిమా 'అల... వైకుంఠపురములో' చిత్రానికి తమన్ ఇచ్చిన పాటల స్థాయిలో దేవిశ్రీప్రసాద్ పాటలు ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు 'సరిలేరు నీకెవ్వరు' పాటలు నచ్చినప్పటికీ... మెజారిటీ ప్రేక్షకుల నోళ్ళలో 'అల...' పాటలు వినిపించాయి. అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ దగ్గర సరుకు అయిపోయిందనే విమర్శలు వినిపించాయి. వాటన్నిటికీ ఒక్క పాటతో చెక్ పెట్టాడు దేవిశ్రీ.
దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో సినిమా అంటే మ్యూజికల్ హిట్ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవచ్చు. సుక్కు సినిమాలకు దేవి ఎప్పుడూ బెస్ట్ సాంగ్స్ ఇస్తూ వచ్చాడు. సుక్కు అసిస్టెంట్ సానా బుచ్చిబాబు దర్శకుడిగా మారి తీస్తున్న తొలి సినిమా 'ఉప్పెన'కి కూడా బెస్ట్ సౌండ్ ఇచ్చాడని ఇప్పటికే విడుదలైన రెండు పాటలు వింటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా, విన్నా... 'ధక్ ధక్ ధక్' పాటే కనపడుతోంది. వినబడుతోంది. దేవిశ్రీప్రసాద్ మార్క్ ఈ పాటలో కనిపించింది. సంగీతం, సాహిత్యం... ముఖ్యంగా 'ధక్ ధక్' శబ్దాన్ని వివిధ వాయిద్యాలతో వినిపించడం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. పలువురు సినిమా ప్రముఖులు ఈ పాట విని దేవి శ్రీ ప్రసాద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో దేవి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.