'దేవర' గురించి కొరటాల సంచలన ప్రకటన.. వీడియో రిలీజ్!
on Oct 4, 2023
ఈ మధ్య కాలంలో పలు భారీ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దేవర' కూడా వచ్చింది. దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించారు.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రూపొందుతోన్న మూవీ 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఆ అంచనాలను, నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కొరటాల ఓ వీడియోని విడుదల చేశారు.
"దేవరలో ఓ కొత్త ప్రపంచం చూపించబోతున్నాం. బలమైన కథ, బలమైన పాత్రలు, బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కథగా ఎంత ఎక్సైట్ అయ్యామో, తెరకెక్కిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాం. దేవర ప్రపంచం రోజురోజుకి పెద్దగా కనిపిస్తోంది. కథ పెద్దది కావడం, బలమైన పాత్రలు, ఎమోషన్స్ ఉండటంతో.. ఆదరాబాదరాగా ఒక్క పార్ట్ లో ఈ కథని ముగించడం తప్పు అనిపించింది. ఈ కథని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం" అని కొరటాల వీడియోలో తెలిపారు.
దేవర చిత్రం 2024 ఏప్రిల్ 05న విడుదల కానుందని గతంలో ప్రకటించారు. ఇప్పుడు రెండు పార్టుల అనౌన్స్ మెంట్ రావడంతో.. మొదటి ఏప్రిల్ 05న రానుందని అర్థమవుతోంది. మరి రెండో భాగం ఎప్పుడొస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
