ఇండియన్స్ గురించి రష్మిక చులకన మాటలు.. అందుకే డిలీట్ చేశారా?
on Sep 7, 2022
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతారామం'. ఇందులో అఫ్రీన్ అనే కీలక పాత్రలో రష్మిక నటించింది. ఆగస్టు 5న థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో అలరించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి డిలీటెడ్ సీన్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
'సీతారామం'లో రష్మిక పాకిస్తాన్ యువతి పాత్రలో నటించింది. ఇండియా అంటే ఇష్టంలేని ఆమె.. తాత కోరిక మేరకు రామ్ (దుల్కర్) రాసిన ఉత్తరాన్ని సీత (మృణాల్)కు అందజేసే బాధ్యత తీసుకుంటుంది. తాజాగా విడుదల చేసిన డిలీటెడ్ సీన్ లో.. రష్మిక టాక్సీలో 'నూర్జహాన్ మహిళా కళాశాల'కు వెళ్తుంది.
అక్కడ ప్రిన్సెస్ నూర్జహాన్ గురించి వివరాలు తెలుసుకొని బయటకు వచ్చాక.. టాక్సీ డ్రైవర్ తో "ఓ ఇంకా ఇక్కడే ఉన్నావా!.. పరవాలేదు ఇండియాలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట" అంటూ ఇండియన్స్ దొంగలు అన్నట్టుగా తప్పుగా మాట్లాడుతుంది. దానికి టాక్సీ డ్రైవర్ బదులిస్తూ "ఇక్కడ అందరూ నాలాంటోళ్ళే ఉంటారు మేడం.. మీ బ్యాగ్ తీసుకుపోయి మా దేశం పరువు మీతో పంపలేనుగా మేడం" అంటూ ఆమె కారులో మర్చిపోయిన బ్యాగ్, పాస్ పోర్ట్ తిరిగిచ్చేసి అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని చెప్తాడు. ఈ సీన్ ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇండియన్స్ గురించి రష్మిక తప్పుగా మాట్లాడినట్టు డైలాగ్స్ ఉండటంతో ఈ సన్నివేశాన్ని తొలగించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వర రావు, సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్ పనిచేశారు.