ENGLISH | TELUGU  

ముదిరిన 'మా' వివాదం! తీవ్ర స్థాయికి చేరిన నరేశ్, రాజశేఖర్ వర్గాల విభేదాలు!!

on Oct 20, 2019

 

తెలుగు నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా)లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధ్యక్షుడు సీనియర్ నరేశ్, ఆయన మద్దతుదారులు ఒక వర్గంగా, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన మద్దతుదారులు ఇంకో వర్గంగా చీలిపోయారు. అధ్యక్షుడు నరేశ్‌ ప్రమేయం లేకుండా.. రాజశేఖర్, 'మా'కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన భార్య జీవిత ఆదివారం 'మా' సమావేశాన్ని నిర్వహించడం వివాదాన్ని మరింత పెంచింది. వారం రోజుల క్రితం ఈ మీటింగ్ పెడుతున్నట్లు 'మా' సభ్యులకు జీవితా రాజశేఖర్ సమాచారం ఇవ్వడంతో, దీనిపై 'మా' సభ్యులు మాణిక్ రావ్, కుమారస్వామి కోర్టుకెళ్లారు. వాదనల అనంతరం.. ఆదివారం జరిపే సమావేశాన్ని 'జనరల్ బాడీ మీటింగ్'గా వ్యవహించవద్దని రాజశేఖర్‌కు కోర్టు సూచించినట్లు మాణిక్ తరపు న్యాయవాది తెలిపారు. 

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో సీనియర్ నరేశ్ ప్యానెల్ నుంచి నరేశ్, రాజశేఖర్, జీవిత వంటివాళ్లు గెలిచారు. నరేశ్ అధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే కార్యవర్గ సభ్యులుగా శివాజీరాజా ప్యానెల్‌కు చెందినవాళ్లు ఎక్కువమంది గెలిచారు. మార్చి 22న 'మా' కొత్త కార్యవర్గ ప్రమాణం చేస్తున్నప్పుడే ఒకే ప్యానల్‌లో ఉన్న నరేశ్, రాజశేఖర్ మధ్య విభేదాలు ఉన్నట్లు చూచాయగా బయటపడ్డాయి. నరేశ్ 'నేను' అంటూ పదే పదే ప్రస్తావిస్తూ.. అదంతా తన గెలుపుగా చెప్తుండటంతో, రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా సభ్యులతో ఏమాత్రం చర్చించకుండా, కొన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నరేశ్ సొంతంగా ప్రకటించడం కూడా చాలామందికి అసంతృప్తి కలిగించింది. అలా మార్చి 22నే 'మా'లో లుకలుకలు ఉన్నాయనే విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.

'మా' బాధ్యతలు చేపట్టాక ఏదో ఒక మంచి పనిచేసి చూపించాలని జీవిత, రాజశేఖర్ భావిస్తూ వస్తున్నారు. అయితే తనకున్న బిజీ షెడ్యూల్ వల్లనో, మరో కారణం చేతనో 'మా'కు నరేశ్ ఎక్కువ సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు కొంతమంది సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి. 'మా' మూలనిధిని పెంచకుండా, ఉన్నదాన్నే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాల గురించి తోటి సభ్యులతో జీవిత, రాజశేఖర్ చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దానిపై నరేశ్ కోర్టుకెళ్లడంతో, ఆ నిర్ణయాల్ని అమలు చేయొద్దంటూ కోర్టు స్టే ఇచ్చింది. 

దాంతో ఆదివారం ఒక 'ఫ్రెండ్లీ మీటింగ్'ను రాజశేఖర్ దంపతులు ఏర్పాటుచేశారు. దీని కోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు కూడా. తమ ముందున్న సమస్యల విషయంలో 'మా' సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొనే అవకాశం ఇవ్వమని కోరగా కోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి అనుగుణంగా 'మా' సాధారణ సమావేశాన్ని ఏర్పాటుచేశామని, దానికి రావాల్సిందిగా సభ్యులకు జీవిత, రాజశేఖర్ సమాచారం పంపించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మీటింగ్ జరిగింది. దీనికి మీడియాను అనుమతించలేదు. అయితే సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చిన నటుడు పృథ్వీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. నరేశ్, రాజశేఖర్ రెండు వర్గాలుగా విడిపోయి వాడివేడిగా వాదోపవాదాలు చేసుకున్నారు. ఒక వర్గంపై మరో వర్గం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 

'మా' ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ 'మా' తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జీవితా రాజశేఖర్ వర్గం నిర్వహించిన సమావేశాన్ని దౌర్భాగ్యకరమైన సమావేశమని దుయ్యబట్టారు. 'మా' ఈసీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. "నేను ఈసీ మెంబర్‌గా గెలిచానని ఆనందపడాలో, అనవసరంగా వచ్చానని బాధపడాలో అర్థం కావట్లేదు" అని ఆయన వాపోయారు. కొత్త బాడీ ఏర్పడి 8 నెలలు గడిచిపోయాయనీ, 'మా' కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఫీలవుతున్నాడనీ ఆయన విమర్శించారు. "అర్జెంట్ మీటింగ్ అంటే.. నేను తిరుపతి నుంచి వచ్చాను. మీటింగ్ జరిగే తీరు చూస్తే.. దౌర్భాగ్యం అనిపించింది" అని ఆయన చెప్పారు. 400 సినిమాలకు మాటలు రాసిన తమ గురువు పరుచూరి గోపాలకృష్ణగారిని కూడా మాట్లాడనివ్వలేదనీ, ఆయన కళ్లెంట నీళ్లుపెట్టుకొని బయటకు వెళ్లడం ఫస్ట్ టైం చూశాననీ పృథ్వీ విచారం వ్యక్తం చేశారు. 'మా' కార్యవర్గాన్ని రద్దుచేసి, మళ్లీ ఎన్నికలు జరిపించడం ఒక్కటే ప్రస్తుతం సమస్యకు పరిష్కారంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.