అమృతగాయకుడు చిత్తూరు నాగయ్యగారు
on Mar 28, 2019
తన గళంతో సంగీత సరస్వతికి అమ్రుతాభిషేకం చేసిన అమృతగాయకుడు చిత్తూరు నాగయ్యగారు. ఆ మహానుభావుడి జన్మదినం మార్చి 28. ఆయన 1904 మార్చి 28 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో వెంకటలక్ష్మాంబ, రామలింగశర్మల ముద్దు బిడ్డగా జన్మించారు. అయితే పెరుగుతున్న సమయంలో అమ్మమ్మ ఈ బిడ్డ మీద ప్రేమతో చిత్తూరు జిల్లా గోగునూరు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఆమె పెంపకంలో నాటక రంగంపట్ల ఆసక్తి పెంచుకున్నారు.
సంగీతం, గానం, నటన పట్ల అభినివేశం పెంచుకొని ప్రముఖ కంపెనీలకు వెళ్ళి నాటకాలేశారు. హార్మోనియాలు బాగుచేసే సి.ఎం.దొరై దగ్గర హార్మోనియం నేర్చుకుని సరిగమలకు పదును పెట్టారు. టీచర్ గా, ఫారెస్ట్ ఆఫీస్ లో గుమాస్తాగా ఇలా చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు. ఇవి చేస్తూ సంగీతాన్ని వదల్లేదు. సంగీతకళానిధి చిత్తూరు సుబ్రహ్మణ్యం గారి దగ్గర వర్ణాలు క్రుతులు నేర్చుకున్నారు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ గా చేసిన బోల్టన్ దొర దగ్గర ఆంగ్ల సంగీతం నేర్చుకున్నారు.
బి.ఏ. పాసయ్యాక మద్రాసులోని సుగుణ విలాస సభలో ప్రదర్శించే నాటకాల్లో పాల్గొనేవారు. ఆయన నటించే నాటకాల్లో ఆయన పాటలు ఆయనే పాడే వారు. 1933.34 సంవత్సరాల్లో హెచ్.ఎం.వి కంపెనీ ప్రైవేట్ రికార్డ్ లు పాడే అవకాశం వచ్చింది. అదెంతో పేరు తీసుకొచ్చింది. తర్వాత బి.ఎన్.రెడ్డిగారితో దోస్తీ ఆయన్ని సినీ రంగంలోకి తీసుకొచ్చింది. అదే 1939 లో వచ్చిన వందేమాతరం సినిమా. బి.ఎన్.రెడ్డిగారు ఈ చిత్ర సంగీత దర్శకత్వ భాధ్యతలు కూడా నాగయ్యగారికే అప్పజెప్పారు. అంతే నాగయ్యగారు అద్బుతంగా చేశారు. మొత్తం 18 పాటలు , 2 పద్యాలు చేశారు. ఇందులో 6 పాటలు నాగయ్యగారు పాడితే, 4 పాటలు కాంచనమాల గారి చేత పాడించారు. మిగిలిన ఎనిమిది పాటలను వేరే సింగర్స్ చేత పాడించారు. ఈయన సంగీతం ఈ సినిమా విజయానికి దోహదపడింది. తల్లిని మించిన దైవము, పూలో పూలోపూలోపాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత సుమంగళి, దేవత, భక్తపోతన, స్వర్గసీమ, త్యాగయ్య, యోగివేమన, బీదలపాట్లు, మరదలుపెళ్ళి, నా ఇల్లు, గుమాస్తా రామదాసు సినిమాలు చేశారు.
1945 లో వచ్చిన స్వర్గ సీమ సినిమా నాగయ్య సంగీతంలో కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. సముద్రాల సీనియర్ రికమెండేషన్ తో వచ్చిన ఘంటసాల గారికి ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశం ఇచ్చింది ఈ చిత్రమే. ఇందులో ఓ ఓ నా రాజా...ఓహో నారాజా అంటూ ఘంటసాల గారి చేత పాట పాడించారు. నాగయ్య నటన సంగీతాల సమ్మేళనంతోయోగివేమన చిత్రం బహుప్రశంసలు పొందింది. త్యాగయ్య సినిమా కోసం నిజంగా నాగయ్య చేసిన కసరత్తులు ఇన్నీ అన్నీకావు అంటారు. మహామహులను ఆహ్వానించి అందరి సూచనలతో సలహాలతో మొత్తం 44పాటలు కీర్తనలు సిద్ధం చేస్తూ...ఉత్తరాది ప్రసిద్ధగాయకుడు కరీంఖాన్ మద్రాస్ లో కచ్చేరి చేయడానికి వస్తే ఆయన కీర్తనలు విని నాగయ్య పరవశులై ఆయనని అభినందిస్తూ...ఎందరో మహానుభావులు కీర్తన పాడారట. వెంటనే కరీంఖాన్ ఆనంద పరవశులై ఆయన దగ్గర ఉండే రామ్ లక్ష్మణ్ తంబురాల్లోంచి రామ్ తీసి నాగయ్య గారికి ఇచ్చారట. ఆ తంబురానే నాగయ్యగారు త్యాగయ్య సినిమాలో వాడారట. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తే నాగయ్య ఆనందపరవశులైపోయారట.
ఆయన స్వరమధురిమలు అందించిన ఆఖరి చిత్రం రామదాసు.
భారత ప్రభత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు...
ఆయన చేసిన వాటిలో ప్రేక్షకులను ఇప్పటికీ మరువనివ్వని..
పాటలెన్నో ఉన్నాయి...ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా
తలుచుకుందాం.