కైకాల ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్న చిరంజీవి.. చినబాబుకి జగన్ ఫోన్!
on Nov 24, 2021
టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణాలతో కైకాల అపోలోలో చేరిన సమయం నుంచి మెగాస్టార్ చిరంజీవి అపోలో వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కష్ట సమయంలో కైకాల కుటుంబానికి అన్నీ తానై అపోలో డాక్టర్లతో మాట్లాడుతూ కైకాల కుటుంబ సభ్యులకు చిరంజీవి ధైర్యం చెబుతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కూడా కైకాల సత్యనారాయణ చిన్న కుమారుడు, కేజిఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చినబాబు)కు ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్, కన్నడ స్టార్ హీరోలు యష్, శివ రాజ్ కుమార్ చినబాబుకు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేసి, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పారు.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా చిన్నబాబుకు ఫోన్ చేసి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని అపోలోలో చికిత్స పొందుతున్న కైకాలను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక ఐఏఎస్ అధికారి వచ్చి కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. కైకాల ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Also Read