బాలకృష్ణ: ప్రేక్షకులు ఆదరిస్తే 'నర్తనశాల' మళ్లీ చేస్తా!
on Oct 22, 2020
సాంఘిక, జానపద చిత్రాలే కాదు... పౌరాణిక చిత్రాలలోనూ నటించి మెప్పించిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. కమర్షియల్ సినిమాలు, ఫ్యాక్షన్ కథలతో భారీ విజయాలు అందుకున్న ఆయన... 'శ్రీరామరాజ్యం' వంటి పౌరాణిక చిత్రాన్ని, 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చారిత్రక చిత్రాన్ని చేశారు. అయితే... తన తండ్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన 'నర్తనశాల' చిత్రాన్ని రీమేక్ చేయాలని తలపెట్టిన యజ్ఞం మధ్యలో ఆగింది. అప్పట్లో ఆ సినిమా కోసం తీసిన 17 నిమిషాల వీడియో విజయ దశమి సందర్భంగా ఈనెల 24న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకాదరణ లభిస్తే 'నర్తనశాల' చిత్రాన్ని మళ్లీ చేస్తానని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా అప్పటి సంగతులను ఆయన గుర్తు చేసుకున్నారు.
శరత్ బాబు, సౌందర్య, శ్రీహరి దగ్గర పది రోజులు కాల్షీట్లు తీసుకుని ఐదు రోజుల్లోనే సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశానని బాలకృష్ణ తెలిపారు. "నేను ఎన్టీఆర్ స్కూల్ కి చెందిన వాడిని. ప్రతి యాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా అందుబాటులో ఉన్న యాక్టర్లతో షూటింగ్ ప్రారంభించి వాడిని" అని ఆయన చెప్పారు.
అర్జునుడు, భీముడు, కీచకుడు, కృష్ణుడు... 'నర్తనశాల'లో ఆ నాలుగు పాత్రలు తనకు చేయాలని ఉందని మనసులో కోరికను బాలకృష్ణ బయట పెట్టారు. ఏటీటీలో విడుదలవుతున్న 17 నిమిషాల 'నర్తనశాల'కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయం సాధించడం తథ్యమని చెప్పవచ్చు. అందువల్ల పూర్తి స్థాయి సినిమాగా 'నర్తనశాల'ను బాలకృష్ణ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
Also Read