ఉగాది కానుకగా బాలయ్య చిత్రం?
on Jan 19, 2021
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అఘోరాగా, ఐఏఎస్ అధికారిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఉగాది కానుకగా ఏప్రిల్ ప్రథమార్ధంలో విడుదల చేయడానికి బోయపాటి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే విడుదల తేదిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సింహా కూడా 2010 ఏప్రిల్ లో విడుదలైంది. అప్పట్లో రికార్డు స్థాయి వసూళ్ళను మూటగట్టుకుంది. మరి.. తాజా చిత్రం కూడా అదే ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.